ఇంత అరాచకమా?, బతుకుజీవుడా అనుకుంటూ బయటకు..: పవన్ సభలో మహిళలకు ఇలాంటి పరిస్థితా!
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులు ఆయన పార్టీకి కొండంత బలమే అయినప్పటికీ.. చాలాసార్లు వారి ప్రవర్తన శృతిమించుతోందన్న విమర్శలు లేకపోలేదు.
శనివారం నాటి ఒంగోలు సభలో స్వయంగా పవన్ కళ్యాణే ఫ్యాన్స్ ప్రవర్తన పట్ల కొంత ఇబ్బందికరంగా ఫీలయ్యారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేలా సాగిన వారి అరుపులు, కేకలు పట్ల కాస్త అసహనం వ్యక్తం చేశారు. తనకు కావాల్సింది అరుపులు కేకలు కాదంటూ పరోక్షంగా చురకలంటించారు.
వేదిక మీదున్న పవన్ కళ్యాణ్ పరిస్థితే అలా ఉంటే.. ఇక సభకు వచ్చిన మహిళా కార్యకర్తల పరిస్థితి మరింత అధ్వాన్నం అంటున్నారు విజయలక్ష్మి అనే ఓ కార్యకర్త. మహిళలకు పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని పవన్ ప్రకటించిన తరుణంలో.. ఓ మహిళా కార్యకర్త పార్టీపై తన అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.

బతుకుజీవుడా..
విజయలక్ష్మి అనే ఓ జనసేన మహిళా కార్యకర్త ట్విట్టర్ లో ఓ వీడియో పోస్టు చేశారు. ఒకరకంగా ఒంగోలు సభలో మహిళా కార్యకర్తలంతా బాధితుల్లా మిగిలిపోయారని పరోక్షంగా ఆమె వ్యాఖ్యానించారు. బతుకుజీవుడా అంటూ సభ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని, తమకు కనీస భద్రత లేని చోట.. ఆ మాత్రం దానికి ఆహ్వానాలు ఎందుకు పంపారని ఆమె ప్రశ్నించారు.

ఈమాత్రానికేనా?
తమకేమో సమన్వయ కార్యకర్తల సమావేశం అని మొబైల్ కు మెసేజ్ లు పంపించారని, తీరా అక్కడికెళ్తే.. అంతా అభిమానులే ఉన్నారని విజయలక్ష్మి వాపోయారు. ఈ మాత్రం దానికి సమన్వయ కార్యకర్తల సమావేశం ఎందుకు అన్నారని ప్రశ్నించారు.
లోపలికి వెళ్లడానికి కూడా తమకు అవకాశం లేకుండా పోయిందని, తోసుకుంటూ..నెట్టుకుంటూ.. ఎలాగోలా లోపలికి వెళ్లగలిగామని అన్నారు. లోపలికెళ్లాక ఫ్యాన్స్ ప్రవర్తన తమను భయభ్రాంతులకు గురిచేసిందని, అసలు ఇక్కడినుంచి బయటకెళ్లగలమా? అన్న సందేహం కూడా కలిగిందని ఆమె అన్నారు. అభిమానులతో సమావేశం పెట్టుకోవడానికే అయితే.. మమ్మల్ని ఎందుకు పిలిచారని ఆమె నిలదీశారు.

మాకేమైనా అయితే:
తమకేమైనా అయితే తమ కుటుంబాలే నష్టపోతాయని, దానికి ఎవరు బాధ్యత వహిస్తారని విజయలక్ష్మి ప్రశ్నించారు. పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో కష్టపడే తమను కనీసం పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు.
సభలో తమకు ఎదురైన పరిస్థితి గురించి జనసేన అధికార ప్రతినిధితో చెప్పడానికి వెళ్తే.. మీరు పార్టీలో ఉండాలనుకుంటున్నారా?.. బయటకు వెళ్లాలనుకుంటున్నారా? తమనే ఎదురు ప్రశ్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలంటే విలువ లేకుండా అయిపోయిందన్నారు.

బయటకొస్తానో.. లేదో అని భయపడ్డాను:
పవన్ కళ్యాణ్, అధికార ప్రతినిధి ఏ.సీ కార్లలో తిరుగుతూ ఉంటారని, పార్టీ కోసం గ్రౌండ్ లెవల్ లో ఇంత కష్టపడుతుంటే.. మహిళలను కనీసం గౌరవించాలని తెలియదా? అని ఆక్రోశం వెల్లగక్కారు. సభలో ఉన్నంతసేపు.. అసలు బయటకొచ్చి మళ్లీ మావాళ్లను చూస్తానో... లేదో అన్నంత టెన్షన్ కు గురయ్యానని, తన తోటి మహిళా కార్యకర్తలు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారని ఆమె తెలిపారు.
మహేష్ కత్తి పోస్ట్:
సినీ విమర్శకులు మహేష్ కత్తి తన సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియో పోస్టు చేయడంతో.. మరింత వైరల్ గా మారింది. వీడియోను పోస్టు చేయడంతో పాటు మరోసారి జనసేనపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.
'ఇద్దరు పిల్లల తల్లి. ఒక దశాబ్దం పాటు కలిసి బ్రతికిన రేణు దేశాయ్ కి ఫ్యాన్స్ నుంచి బెదిరింపులు వస్తే, ఒక్క మాట కూడా మాట్లాడని పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీలోకి వచ్చే మహిళలకు రక్షణ ఇస్తాడని ఎలా అనుకున్నారు తల్లీ మీరు?
పవన్ కళ్యాణ్ పిచ్చి సేనకు దక్కిన తిక్క సేనాని. అక్కడ ఫ్యాన్స్ అనే భక్తుల మాటలే చెల్లుతాయి. మీకు దక్కేవి అవమానాలు, ప్రాణ భయాలే. మహిళలారా...తల్లులారా జనసేనకు దూరంగా ఉండండి. అదొక ఉన్మాదపు సేన. అతనో తిక్క సేనాని. మీ జాగ్రత్తలో మీరు ఉండండి' అంటూ మహేష్ కత్తి తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications