మా నెయ్యిలో ఎలాంటి నాణ్యతా లోపం లేదు: ఏఆర్ డెయిరీ
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను ఆందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ తాజాగా దీనిపై స్పందించింది. నాణ్యత పరీక్షల తర్వాతే నెయ్యి సరఫరా చేసినట్లు వెల్లడించింది.
జూన్, జులైలోనే టీటీడీకి నెయ్యి సరఫరా చేశామని, ల్యాబ్ పరీక్షల తర్వాతే నెయ్యి సరఫరా అయినట్లు తెలిపింది. సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి నాణ్యతా లోపం లేదని స్పష్టం చేసింది. కానీ, తమపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడింది. టీటీడీ కోరితే టెస్ట్ రిపోర్టులు పంపామని.. టీటీడీ తమకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదని ఏఆర్ డెయిరీ పేర్కొంది.
అయితే, ఇప్పుడు తమ డైరీ టీటీడీకి సరఫరా చేయడం లేదని తెలిపింది. తమ ఏఆర్ డెయిరీ ఉత్పత్తులను దేశ వ్యాప్తంగా అందిస్తున్నామని పేర్కొంది. 25 సంవత్సరాలుగా తాము డెయిరీ నడుపుతున్నామని.. ఎప్పుడూ తమ డైరీపై ఇలాంటి ఆరోపణలు రాలేదని తెలిపింది.

ఇది ఇలావుండగా, తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ వ్యవహారంపై టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించారు. శ్రీవారి లడ్డూ నాణ్యతపై కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. లడ్డూ నాణ్యతపై పోటు సిబ్బందితో మాట్లాడానని వారు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. లడ్డూ నాణ్యతగా ఉండాలంటే నెయ్యి నాణ్యంగా ఉండాలని ఈవో పేర్కొన్నారు.
నెయ్యి నాసిరకంగా ఉందని గుత్తేదారుకు చెప్పామని ఆ నాణ్యతా లోపాన్ని తాను కూడా గమనించానని అన్నారు. నెయ్యి నాణ్యత నిర్ధరణకు టీటీడీకి సొంత ప్రయోగశాల లేదని నాణ్యత నిర్ధారణ కోసం బయట ల్యాబ్స్పై ఆధారపడాల్సిన పరిస్థితి ఉందన్నారు. నెయ్యి నాణ్యతపై అధికారులు గతంలో పరీక్షలు చేయలేదని తెలిపారు.
రూ.411కే కిలో నెయ్యి సరఫరా చేశారని.. నాణ్యమైన నెయ్యిని అంత తక్కువ ధరకు ఎవరూ సరఫరా చేయలేరని ఈవో వివరించారు. మేం హెచ్చరించిన తర్వాత గుత్తేదారులు నాణ్యత పెంచారని తెలిపారు. జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసినట్లు ఎన్డీడీబీ తేల్చిందని ఈవో అన్నారు. నెయ్యి తీవ్ర కల్తీ జరిగిందని తేలిన వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కమిటీ వేసినట్లు తెలిపారు. రూ.75 లక్షల విలువైన నెయ్యి నాణ్యత పరికరాలను ఎన్డీడీబీ విరాళంగా ఇచ్చిందని ఈవో వెల్లడించారు.
తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఈవో శ్యామలరావు తెలిపారు. 4 ట్యాంకర్లలోని నెయ్యిని 10 ప్రయోగశాలలకు పంపినట్లు టీటీడీ ఈవో తెలిపారు. నెయ్యి నాణ్యత నిర్ధరణ కోసం ఎన్డీడీబీ ల్యాబ్కు పంపినట్లు వెల్లడించారు. ఎన్డీడీబీ ల్యాబ్ అనేది చాలా ప్రముఖమైనదని ఆ ల్యాబ్ గుజరాత్లోని ఆనంద్లో ఉందని తెలిపారు.
ల్యాబ్ పరీక్షల్లో నెయ్యి నాణ్యత లేదని తేలిందన్నారు ఈవో. జులై 6న నెయ్యిని ప్రయోగశాలలకు పంపామని వారంలో ల్యాబ్ నివేదికలు వచ్చాయని తెలిపారు. ల్యాబ్ రిపోర్టులు రెండు విభాగాలుగా ఇచ్చారని ఆ రిపోర్టులో నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్లు నివేదికలు తేల్చాయని వివరించారు. 100 పాయింట్లు ఉండాల్సిన నెయ్యి నాణ్యత 20 పాయింట్లే ఉందని ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. దీంతో నెయ్యిలో బాగా కల్తీ జరిగిందని తేలిపోయిందన్నారు.












Click it and Unblock the Notifications