పవన్ కళ్యాణ్ తప్పు లేదు, రెచ్చగొట్టడానికే జగన్: నారాయణ
హైదరాబాద్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజధానికి వెళ్లి చూడటంలో తప్పులేదని, ఆయన సూచనలిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. రైతులు ఊహించిన దానికంటే మెరుగ్గా ప్యాకేజీ సీఎం ఇచ్చారని, ఇటువంటి పరిస్థితుల్లో రెచ్చగొట్టడానికే జగన్ రాజధానిలో పర్యటిస్తున్నాడని మండిపడ్డారు.
సచివాలయంలో మంగళవారం మునిసిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.గిరిధర్, పెట్టుబడులు, ఇంధన, మౌలిక సదుపాయాల కల్పన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ తదితరులు సమావేశమయ్యారు. సమావేశం తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.
ఉద్యోగుల అభిప్రాయాలను తీసుకుని తాత్కాలిక రాజధానిపై నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఈ మేరకు పదో తేదీన సమావేశమై చర్చిస్తామని చెప్పారు. కొత్త రాజధానిలో వారికి ఎన్ని ఇళ్లు అవసరమవుతాయి?, ఎన్ని శాఖలు తరలించాలన్న విషయాలను వారితో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. జూన్నాటికి తాత్కాలిక రాజధానిని తరలించాలని గతంలో భావించినా అది సాధ్యం కాదన్నారు.
శాశ్వత రాజధానిని 2018 జూన్కల్లా ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఉద్యోగుల్లో 60 శాతం మందికి హైదరాబాద్లో సొంతిళ్లు ఉన్నాయని, వారిని అసౌకర్యాలతో అక్కడకు తీసుకెళ్లలేమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హైదరాబాద్లో 28 వేల మంది ఏపీ ఉద్యోగులు పని చేస్తున్నారని, ఇప్పటికిప్పుడు వారందరినీ రాజధానికి తరలించడం కష్టమవుతుందని చెప్పారు.
ఒకవేళ తరలించినా, 15 శాఖల ఉద్యోగులకే అక్కడ వసతులు కల్పించే అవకాశం ఉందని, ఈనెల 10న ఉద్యోగులతో సమావేశం జరిగే నాటికి అక్కడ ఉన్న నివాస గృహాలపై నివేదిక తెప్పిస్తామని తెలిపారు.