ప్రతిపక్షం కోసం కాదు...ప్రజలను మెప్పించే వ్యూహాలు ఉండాలి:అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో చంద్రబాబు
అమరావతి:ప్రతిపక్షం ఉన్నప్పుడే వ్యూహాల గురించి యోచన చేయడం కాదని...ఎల్లప్పుడూ ప్రజలను మెప్పించే వ్యూహాలు ఉండాలని అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మంత్రులు, విప్లు, పార్టీ బాధ్యులు, ఇతర టిడిపి ముఖ్యులు తదిదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రతిపక్షం లేకపోయినా అసెంబ్లీ బాగా జరిగిందనే పేరు రావాలని ఆకాక్షించారు. ప్రజలు అన్నింటిని నిశితంగా గమనిస్తున్నారని వారంతా సానుకూల దృక్ఫథం గలవారన్నారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ప్రతికూల స్వభావాన్ని ప్రజలు సహించరని...ఇక బాధ్యతా రాహిత్యాన్ని అయితే అసలే సహించరని చంద్రబాబు విశ్లేషించారు. ప్రభుత్వం పనిచేసేది ప్రతిపక్షం కోసం కాదని...ప్రజల కోసమని అన్నారు. వైసిపి విషయానికొస్తే అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని ప్రతిపక్షాన్ని ఇటీవల ఉపాధ్యాయులు నిలదీశారని దానికి సమాధానం చెప్పలేని స్థితిలో వైకాపా నేతలు మొహం చాటేశారని సీఎం వ్యాఖ్యానించారు.
అన్నివర్గాల ప్రజల్లో ప్రతిపక్షంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. కారణం ప్రాథమిక బాధ్యతలనుండి ప్రతిపక్షం విస్మరించడమేనని విశ్లేషించారు. సభకు హాజరుగాని సభ్యత్వం వృధా అని...ప్రతి సమావేశానికి హాజరుకావడం శాసన సభ్యుడి ప్రాథమిక బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు పలికారు. ఎల్లప్పుడూ ప్రశ్నలు వేయడమే కాదని, స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్చలు అర్ధవంతంగా జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
కౌన్సిల్లో రాజధాని నిర్మాణంపై జరిగే చర్చలో అందరూ పాల్గొనాలని సీఎం చంద్రబాబు టిడిపి ప్రజాప్రతినిథులకు సూచించారు. అనుబంధ ప్రశ్నల ద్వారా లోతైన చర్చ జరిగేలా శ్రద్ధ చూపడం, విషయ పరిజ్ఞానంతో వాస్తవాలను ప్రజల్లోకి పంపడం చేయాలన్నారు.