Vijayawada Loksabha:విజయవాడలో పోటీ చేస్తే.. సన్యాసమే గతి..!
Kesineni Nani: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, విజయవాడ లోక్సభ మాజీ సభ్యుడు కేశినేని నాని తీసుకున్న నిర్ణయం.. రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తన రాజకీయ ప్రయాణానికి ఎండ్ కార్డ్ వేశారాయన. రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. అన్నీ ఆలోచించిన తరువాతే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
మొన్నటి ఎన్నికల్లో విజయవాడ లోక్సభ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు కేశినేని నాని. తన తమ్ముడు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని చిన్ని చేతిలో ఓటమిపాలయ్యారు. 2.82 లక్షలకు పైగా ఓట్ల తేడాతో పరాజయాన్ని చవి చూశారు. అంతకుముందు రెండుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలిచిన విషయం తెలిసిందే.

ఈ ఓటమి తరువాత నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తన రాజకీయ ప్రయాణాన్ని ముగించినట్లు ప్రకటించారు. రెండుసార్లు తనను ఎంపీగా గెలిపించిన విజయవాడ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. విజయవాడపై తన నిబద్ధత చెక్కు చెదరబోదని, నగరాభివృద్ధికి తనవంతు కృషి చేస్తూనే ఉంటానని అన్నారు.
కేశినేని నాని రాజకీయ సన్యాసం.. వార్తల్లో నిలిచింది. విజయవాడలో ఓడిన ఎంపీలు దాదాపుగా రాజకీయాలకు దూరమైన వాళ్లే. గతంలో కోనేరు రాజేంద్రప్రసాద్, ప్రసాద్ వీ పొట్లూరి, లగడపాటి రాజగోపాల్.. ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల్లో లేరు. లగడపాటి రెండుసార్లు ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన తరువాత ఆయన పొలిటికల్ కేరీర్ ముగిసింది.
2014, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన కోనేరు రాజేంద్రప్రసాద్, ప్రసాద్ వీ పొట్లూరి పరిస్థితీ దాదాపుగా ఇంతే. ప్రసాద్ వీ పొట్లూరి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోన్నారు. భారతీయ జనతా పార్టీలో చేరారాయన. మొన్నటి ఎన్నికల్లోనూ ప్రచారంలో కూడా పాల్గొనలేదు. మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్.. టీడీపీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications