బుల్ డోజర్ లా దూసుకెళ్తా... తాడో పేడో తేల్చుకుంటా:సిఎం చంద్రబాబు
రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. కేంద్రం గిట్టుబాటు ధర కల్పించకపోతే తాము ఆదుకున్నామన్నారు. రైతులకు మెరుగైన ఆదాయం, సాగు లాభసాటి చేసేవరకు తోడుంటానని చంద్రబాబు భరోసానిచ్చారు.
రాష్ట్రంలో తొలిసారి గ్రామదర్శిని కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లా కొల్లూరు మండలం దోనెపూడిలో సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొల్లూరులో బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ..."పోలవరంలో అవినీతి జరిగిందని కొందరు రెచ్చగొట్టారు...కేంద్రానికి ఫిర్యాదులు పంపారు...అడుగడుగునా అడ్డుతగిలారు...పట్టిసీమకు అడ్డుపడ్డారు...అభివృద్ధికి అడ్డుపడితే బుల్డోజర్లా దూసుకెళ్తా"నన్నారు.
గ్రామదర్శిని...ప్రారంభోత్సవం
తెలుగుదేశం ప్రభుత్వం 1500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో తొలిసారి గ్రామదర్శిని, గ్రామవికాసం కార్యక్రమాలను గుంటూరు జిల్లా కొల్లూరు మండలం దోనెపూడిలో సోమవారం ఆయన ప్రారంభించారు. అంతకుముందు రూ.49.68కోట్లతో పోతార్లంక ఎత్తిపోతలను ప్రారంభించారు. గ్రామదర్శిని ప్రారంభం సందర్భంగా దోనేపూడి ఎస్సీ కాలనీలో పర్యటించిన ముఖ్యమంత్రి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకున్నారు. ప్రజలముందే శాఖల పనితీరును సమీక్షించారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అందరూ పనిచేసేలా చేశామన్నారు. గ్రామంలో వివిధ పనులకు రూ.11.70కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని లంక, సొసైటీ భూముల రైతులకు పట్టాలనిచ్చారు.
కొల్లూరులో...బహిరంగ సభ
గ్రామదర్శిని ప్రారంభోత్సవం సందర్భంగా కొల్లూరులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత గడ్డు పరిస్థితులున్నా సాంకేతికత తోడుగా సుపరిపాలన అందిస్తున్నామని అన్నారు. కేంద్రం సహకరించకపోయినా ప్రగతి కార్యక్రమాలు కొనసాగిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలిచామన్నారు. రాష్ట్రంలో నాలుగేళ్లకు ముందు నీటి కోసం ప్రాంతాల మధ్య గొడవలు జరిగేవని, ప్రస్తుతం గోదావరి-కృష్ణా అనుసంధానంతో అన్ని ప్రాంతాలకు నీరందిస్తున్నామని తెలిపారు. పోలవరాన్ని అడ్డుకోడానికి అంచనాలు పెరిగాయంటూ కొందరు నేతలు కేంద్రానికి ఫిర్యాదులు చేశారని ఆయన గుర్తుచేశారు.
మా అభివృద్ది ఫలాలతో...మాపైనే విమర్శలా?
"తెదేపా ప్రభుత్వ అభివృద్ధి ఫలాలను అనుభవిస్తూ ప్రతిపక్షాలు మమ్మల్నే విమర్శిస్తున్నాయి...నాపై విమర్శలు చేసే స్థాయి ప్రతిపక్షాలకు ఉందా? ...భాజపా నమ్మకద్రోహం చేసింది. కేసుల మాఫీ కోసం వైకాపా రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టింది. ..రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నందున భాజపాతో తాడోపేడో తేల్చుకునేందుకే ఎన్డీయే నుంచి బయటకొచ్చాం"...అని చంద్రబాబు చెప్పారు. "కేంద్ర నిర్ణయాల వల్ల బ్యాంకులు దివాళాతీశాయి...ఏటీఎంల్లో డబ్బులు లేవు. బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది...మన ఖాతాలో రూ.రెండు లక్షలకుపైగా ఉంటే కొత్త చట్టం వల్ల మన డబ్బులనే ఈక్విటీ కింద బ్యాంకులు తీసుకునే పరిస్థితి వచ్చింది. జీఎస్టీతో చిరువ్యాపారులను దెబ్బతీశారు"...అని కేంద్రంపై మండిపడ్డారు.
కన్నాకు...విలువలు ఉన్నాయా?
ఎపి బిజెపి నాయకుడు కన్నా లక్ష్మీనారాయణకు విలువలున్నాయా?...విభజన సమయంలో కాంగ్రెస్లో ఉన్నారు...ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న భాజపాలో ఉన్నారు. వైకాపాకు వెళ్లబోయి చివరి నిమిషంలో అమిత్షా జగన్తో మాట్లాడి భాజపాలో ఉంచారని చంద్రబాబు ఆరోపించారు. కన్నా వైకాపాకు సొంత మైకు, భాజపాకు అద్దె మైకు అని ఎద్దేవా చేశారు. ‘పార్లమెంటులో రాష్ట్ర సమస్యలపై పోరాడాల్సి వస్తుందనే వైకాపా ఎంపీలు పదవులకు రాజీనామా చేశారు...ఎన్నికలు రాకుండా కుమ్మక్కయ్యారు...రాజీనామాలు వైకాపా, భాజపా కలసి ఆడిన నాటకం అని ఆరోపించారు. పవన్కల్యాణ్ను రాష్ట్ర ప్రభుత్వంపై బిజెపినే పురికొల్పుతోందన్నారు.
టిడిపికి అధికారం...చారిత్రాత్మక అవసరం
అమెరికా ఆర్థికమాంద్యంలో ఉన్నప్పుడు ఆనాటి అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ను ఆ దేశస్థులు విశేషంగా ఆదరించారు. 1995లో మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితే ఉండేది. రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నప్పుడు తెలుగుదేశాన్ని 2004లో ఓడించారు...దీనివల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది. 2014లో మళ్లీ ఎన్నుకున్నారు. మరోసారి తెలుగుదేశాన్ని అధికారానికి దూరం చేయొద్దు. రాష్ట్రాభివృద్ధి కోసం తెలుగుదేశం అధికారంలో ఉండటం చరిత్రాత్మక అవసరం అని చంద్రబాబు చెప్పారు.