నన్ను చంపేయాలనుకుంటున్నారు, సీఎం కంటే ఎక్కువే అవుతా: పవన్ కళ్యాణ్ సంచలనం
పశ్చిమగోదావరి: చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ప్రజాపోరాట యాత్రలో భాగంగా ఆయన గురువారం ఉంగుటూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గోన్నారు.
Recommended Video
ఎవరు ఎవరితోనే పడుకుంటే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలా?: దెందులూరులో జనసేనాని (ఫోటోలు)
ఉంగుటూరు నియోజకవర్గంలోని గణపవరంకు రావటం చాలా ఆనందంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన సైనికులకు అధికార పక్షం నుంచి ఇటు ప్రతిపక్షం నుంచి బెదిరింపులు వస్తున్నాయని, దయచేసి అటువంటి పనులను మానుకోవాలని హితువు పలికారు.
మీ గూండాయిజంతో ఆపలేరు
‘మీరు గూండాయిజంతో మమ్మల్ని ఆపలేరు, బయపెట్టలేరు. ప్రతిదానికి చర్యకి, ప్రతిచర్య ఉంటుంది గుర్తుంచుకోండి. పిడికిలిలో బాంబులు పెట్టుకొని వచ్చాం. బాంబులు అంటే కడప బాంబులు కాదు. మాకు మాటలే తూటాలు' అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఓటముల నుంచి పుట్టినదే జనసేన
‘మా పార్టీని ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. మాకు సహనం ఉంది, కాబట్టి భరిస్తాం, సహిస్తాం. అవసరమైతే కాళ్ళు విరగొట్టి కూర్చోబెడతాం. 1983లో టీడీపీ పెట్టినప్పుడు ఎన్టీఆర్ కు అనుకూలించిన విషయాలు, సహకరించిన పరిస్థితులు వేరు. అలాగే 2009లో ప్రజారాజ్యం పెట్టి తిరుపతి సభకు 10 లక్షల మంది జనం వచ్చినప్పుడు ఉన్న ఉధృతి వేరు. కానీ జనసేన ఓటములు నుంచి పుట్టుకొచ్చింది. ప్రజల బాధల నుంచి పుట్టుకొచ్చింది.' అని పవన్ వ్యాఖ్యానించారు.
మీకంత భయమెందుకు?
‘అందరూ కేంద్రానికి భయపడుతుంటే జనసేన ఒక్కటే ఎదురు తిరిగి పోరాడింది. మొన్న ఎవరెవరో చేసిన సర్వేలో 2 శాతం అని, లగడపాటి రాజగోపాల్ సర్వేలో5 శాతం అని చెప్పారు. మరి ఆ 5- 10 శాతం చూసి ఎందుకు భయపడుతున్నారు. రేపు మీరు అధికారంలోకి రావాలన్న, ప్రతిపక్షం అధికారంలోకి రావాలన్న సరే మేమే నిర్ణయించాలి. జనసేనకు సపోర్టు చేసినందుకు దెందులూరు, ఉంగుటూరు ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలను నిలిపివేస్తున్నారు. ఇలాంటివి చేస్తే పోరాటం చేయాల్సి ఉంటుంది' అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
నన్ను చంపేయాలనుకుంటున్నారు
‘ముగ్గురు క్రిమినల్స్ నన్ను చంపేస్తే అసలు సమస్య ఉండదు కదా అని మాట్లాడుకున్న వాయిస్ క్లిప్ నాదాక వచ్చింది, అది ఎవరో కూడా తెలుసు, వారి పేర్లు, ముఖాలు కూడా తెలుసు. నన్ను చంపేసి అధికార, ప్రతిపక్షాలు ఒకరిమీద ఒకరు తోసుకుని అడ్డు తొలగించుకోవాలని.. భయపెట్టాలని చూస్తున్నారు' అని పవన్ కళ్యాణ్ అన్నారు.
నాకు అనుభవం లేదా?
‘ఈ సో కాల్డ్ ఎంఎల్ఏలు రౌడీజం చేస్తూ, రోజు క్లబ్బుల్లో తాగి, తందనాలాడి కాళ్ళు బారా చాపి కూర్చుంటే... నేను రాత్రుళ్లు కూర్చొని సమాజం గురించి ఎన్నో పుస్తకాలు చదివి, సమాజాన్ని అధ్యాయనం చేసి వచ్చిన వాణ్ణి' అని పవన్ కళ్యాణ్ అన్నారు.
సీఎం కంటే ఎక్కువే అవుతా..
‘నాది చిన్న జీవితం. రాజకీయాలు తెలియదు. వేల కోట్ల డబ్బు లేదు. నాకు తెలిసిందల్లా సాటి మనిషి కష్టాల్లో ఉంటే ఆదుకోవడం ఒక్కటే' అని పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం ఏలూరు పాతబస్టాండ్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ ప్రారంభించినపుడు జగన్లా తనక వేలకోట్లు.. లోకేష్లా హెరిటేజ్ కంపెనీ లేదని అన్నారు. 'పవన్ కళ్యాణ్ సీఎం.. పవన్ కళ్యాణ్ సీఎం' అని అభిమానులు నినాదాలు చేయడంపై ఆయన స్పందించారు. 'అసలు నేను ముఖ్యమంత్రే అవుతానని ఎందుకనుకుంటున్నారు? అంత కంటే ఎక్కువే అవుతానేమో? అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.