వీడియో: CM Ramesh..బాగా రిచ్: సొంతంగా విమానాన్నే కొనేశారుగా: క్లారిటీ ఇచ్చిన ఎంపీ కార్యాలయం
కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపకు చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ నాయకుడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్.. సొంతంగా ఓ విమానాన్ని కొనుగోలు చేశారు. ఈ వార్తలను సీఎం రమేష్ కార్యాలయం తోసిపుచ్చింది. ఎయిర్ క్రాఫ్ట్కు రమేష్ పూజలు మాత్రమే చేశారని, దానికి, ఆయనకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాలను వెల్లడించింది.
కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని యర్రగుంట్ల మండలం పొట్లదుర్తికి చెందిన సీఎం రమేష్ స్వతహాగా పారిశ్రామికవేత్త. రిత్విక్ అండ్ రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపక ఛైర్మన్గా కొనసాగుతున్నారు. రోడ్ల నిర్మాణం, విద్యుత్ ఉత్పత్తి, నీటి ప్రాజెక్టులు.. ఇతర మౌలిక వసతుల కల్పన రంగంలో టాప్ కంపెనీగా గుర్తింపు పొందింది.
తన వ్యాపార, పారిశ్రామిక లావాదేవీల కోసం తరచూ ఆయన విమానా ప్రయాణాలను చేయాల్సి ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరిమితంగా విమానాల రాకపోకలు సాగుతోండటం వంటి కారణాల వల్ల ఆయన సొంతంగా ఓ ఫ్లైట్నే కొనేశారు. ఎనిమిది సీట్ల సామర్థ్యంతో కూడుకుని ఉన్న ఛార్టెడ్ ఫ్లైట్ అది. పైలెట్, కోపైలెట్ కాకుండా ఒక ఎయిర్ హోస్టెస్ ఇందులో ఉంటారు. ఈ ఛార్టెడ్ ఫ్లైట్కు సీఎం రమేష్..ప్రత్యేక పూజలు చేశారు. టెంకాయ కొట్టారు. అనంతరం టేకాఫ్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తోన్నాయి.
ఈ వీడియోలు, వార్తలు నిరాధారమైనవని సీఎం రమేష్ కార్యాలయం తెలిపింది. ఈ వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఆయన సొంతంగా ఎయిర్ క్రాఫ్ట్ కొన్నారంటూ వస్తోన్న వార్తలను తోసిపుచ్చింది. ఆ ఎయిర్ క్రాఫ్ట్ను కొనుగోలు చేసిన ఓనర్ ఆహ్వానం మేరకు సీఎం రమేష్ తన చేతుల మీదుగా దానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను మాత్రమే నిర్వహించారని వివరించింది. అంతేగానీ ఛార్టెడ్ ఫ్లైట్కు గానీ, సీఎం రమేష్కు గానీ ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.
Video: కొత్త చార్టెడ్ ఫ్లయిట్కు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పూజలు pic.twitter.com/VX6ePzvei7
— oneindiatelugu (@oneindiatelugu) June 27, 2021
సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశంలో కొనసాగిన సీఎం రమేష్.. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీలో చేరారు. టీడీపీ హయాంలో రాజ్యసభకు నామినేట్ అయిన ఆయన అదే హోదాలో బీజేపీలో కొనసాగుతున్నారు. సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సీఎం రమేష్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు కొనసాగాయి. అదే సమయంలో కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆరురోజుల పాటు ఉక్కు దీక్ష పేరుతో నిరాహార దీక్ష చేశారు. అప్పట్లో ఈ దీక్ష రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది.
Video: సొంత ఛార్టెడ్ ఫ్లయిట్లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ pic.twitter.com/wYxviqtpKt
— oneindiatelugu (@oneindiatelugu) June 27, 2021

2019లో తన కుమారుడు రిత్విక్ వివాహ సమయంలోనూ సీఎం రమేష్ వార్తల్లోకి ఎక్కారు. దుబాయ్లో నిర్వహించిన రిత్విక్ వివాహ కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖుల కోసం భారత్ నుంచి 15 ప్రత్యేక విమానాలను నడిపించారాయన. దుబాయ్లో అంగరంగ వైభవంగా కుమారుడి పెళ్లి జరిపించారు. కోట్ల రూపాయలను దీనికి వ్యయం చేసినట్లు వార్తలొచ్చాయి. ఆ తరువాత మళ్లీ ఆయన మరోసారి వార్తలో వ్యక్తిగా నిలిచారు. తన ప్రయాణ అవసరాల కోసం సొంతంగా ఛార్టెడ్ ఫ్లైట్ను కొనుగోలు చేశారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి, టేకాఫ్ తీసుకున్నారు.












Click it and Unblock the Notifications