గుడివాడలో తేల్చుకుందామంటూ చంద్రబాబుకు కొడాలి నాని సవాల్
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మాజీ మంత్రి, వైయస్సార్సీపీ నేత కొడాలి నాని మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమా షూటింగ్స్ మాదిరిగా చంద్రబాబు జిల్లా పర్యటనలు కొనసాగుతున్నాయని ఎద్దేవా చేశారు.

చంద్రబాబుకే కాదు, టీడీపీకీ చివరి ఎన్నికలన్న కొడాలి నాని
జిల్లాల పర్యటనల్లో టీడీపీ కార్యకర్తలను ప్రజలుగా భావిస్తూ చంద్రబాబు అభివాదాలు చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబుకే కాదు, టీడీపీకి కూడా ఇవే చివరి ఎన్నికలు అని కొడాలి నాని జోస్యం చెప్పారు. చంద్రబాబును మించిన సైకో మరొకరు లేరని విమర్శించారు.

అప్పుడు ఇదేం ఖర్మరా అంటూ బాబు, లోకేష్: కొడాలి నాని
కర్నూలులో హైకోర్టు గురించి న్యాయవాదులు ప్రశ్నిస్తే గుడ్డలూడదీసి కొడతా అని చంద్రబాబు అంటున్నాడని కొడాలి నాని మండిపడ్డారు. 2024 ఎన్నికల తర్వాత ఇదేం కర్మరా అని చంద్రబాబు, లోకేష్ అనుకుంటారన్నారు. చంద్రబాబు పర్యటనలకు ముందుగానే పార్టీ కార్యకర్తలను జిల్లాలకు తరలిస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు.

చంద్రబాబుకు కొడాలి నాని సవాల్
చంద్రబాబు సీఎం కాకపోతే ప్రజలకు పోయేది ఏముందని కొడాలి నాని ప్రశ్నించారు. బతికున్నంతకాలం వైఎస్ జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. తన చివరి రక్తం బొట్టు ఉన్నంత వరకూ సీఎం వైఎస్ జగన్మోహన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలను టీడీపీ మోసం చేసిందన్నారు. గుడివాడలో ఎవరికీ భయపడేది లేదన్నారు. ఎంతమంది వచ్చినా గుడివాడను ప్రభావితం చేయలేరన్నారు. గుడివాడలో చంద్రబాబు పోటీ చేసినా తాను సిద్ధమేనని కొడాలి నాని సవాల్ విసిరారు.

చంద్రబాబుకు అదే భయమన్న బొత్స
మరో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు సహనం కోల్పోయి సభ్యత లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ప్రజలు వైయస్సార్సీపీని బలపరుస్తున్నారనే భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు. ఏదీ చేసైనా సరే రాజకీయ లబ్ధిపొందాలన్నదే చంద్రబాబు తపన అని మంత్రి సత్యనారాయణ విమర్శించారు.












Click it and Unblock the Notifications