ఇదంతా 'కన్నా' కుట్ర...ఎపి అభివృద్దిని చూసి ఓర్వలేక...!:డొక్కా మాణిక్యవరప్రసాద్
అమరావతి: ఎపి ప్రభుత్వంపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కేంద్రానికి ఫిర్యాదు చేయడంపై ఏపీ శాసనమండలి విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ మండిపడ్డారు. సచివాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కన్నా పై విమర్శల వర్షం కురిపించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక, వెల్లువలా వస్తున్న పెట్టుబడులను అడ్డుకోడానికే ఏపీలో శాంతిభద్రతల సమస్య తలెత్తిందంటూ కన్నా కేంద్రానికి ఫిర్యాదు చేశారని డొక్కా మాణిక్యవరప్రసాద్ ధ్వజమెత్తారు. అబద్ధాలతో ప్రజలను ఎలా నమ్మించాలనే విషయమై కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్కు మెమోరాండం రూపంలో ఇచ్చారని డొక్కా ఆరోపించారు.

దొంగే...దొంగ...దొంగ...అన్నట్లుగా కన్నా వ్యవహరిస్తున్నారని డొక్కా దుయ్యబట్టారు. దళితులు, కార్మికులపై బీజేపీ నేతలే దాడులు చేసి ఇతరులపై రుద్దుతున్నారని డొక్కా ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రజల దృష్టిని మరల్చేందుకే బిజెపి నేతలు కుట్రలు పన్నుతున్నారని డొక్కా తేల్చిచెప్పారు. పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలు లేవని ప్రధాని మోదీ, ఏపీలో పరిస్థితులు చేయి దాటి పోతున్నాయని కన్నా అనడం విడ్డూరంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలు బాగానే ఉన్నాయని...రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ముఖ్యమంత్రి చంద్రబాబు కఠిన వైఖరి అవలంబిస్తున్నారని డొక్కా చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితుల గురించి కన్నా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డొక్కా డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications