ఆ ముగ్గురు రాష్ట్రానికి పట్టిన శని గ్రహాలు:మంత్రి కొల్లు;అలాంటి వ్యక్తే ప్రధాని: నారాయణ
అమరావతి: వైసీపీ అధ్యక్షుడు జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వీళ్లు ముగ్గురూ రాష్ట్రానికి పట్టిన శనిగ్రహాలని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.
అమరావతిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ముగ్గురు ఏపీని అధోగతి పాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి జగన్, పవన్, జీవీఎల్ తొత్తులుగా మారారని విమర్శించారు. ఏపీలో అవినీతి జరుగుతుందని అంటున్న నేతలు దమ్ముంటే దాన్ని నిరూపించాలని మంత్రి కొల్లు రవీంద్ర సవాల్ చేశారు.
మరోవైపు కాపు రిజర్వేషన్ల పై వైసీపీ అధ్యక్షుడు జగన్కు అవగాహన లేదని మంత్రి నారాయణ విమర్శించారు. అమరావతిలో ఆయన మీడియాతో తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు ఉన్నప్పుడు...ఏపీలో మాత్రం ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి 25 ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చేసారి రాష్ట్రానికి న్యాయం చేసేవారినే ప్రధానిగా ఎన్నుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
అమరావతిలో అన్ని నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. ప్రపంచంలో ఏ రాజధాని కూడా అమరావతి అంత వేగంగా అభివృద్ది జరగలేదని నారాయణ చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధుల కోసం ఇక్కడ 3 వేల 600 ఇళ్లు నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ ఏడాది ఆఖరుకు ప్రభుత్వ క్వార్టర్ల నిర్మాణాలు పూర్తిచేస్తామని మంత్రి నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.
అమరావతి పాలనా నగరంలో 1600 కి.మీ మేర రోడ్లు నిర్మించాల్సి ఉందని మంత్రి తెలిపారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటివి మినహా...మిగతా అన్ని నిర్మాణాలు వచ్చే మార్చి నాటికి పూర్తి చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.