చెప్పుల భాష మాట్లాడితే సామాజిక బహిష్కరణే - టీడీపీ ముఖ్య నేత వ్యాఖ్యలతో..!!
ఏపీ - తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చెప్పుల బాష ఎక్కువగా వినిపిస్తోంది. ఈ వ్యవహారం పైన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు ఇప్పుడు చేసిన కామెంట్స్ రాజకీయ వేడిని పెంచుతున్నాయి. కొద్ది రోజుల క్రితం విశాఖ పర్యటన తరువాత పార్టీ కార్యాలయంలో జనసేనాని పవన్ చెప్పు చూపిస్తూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. తన గురించి మాట్లాడితే చెప్పుతో కొడతానంటూ హెచ్చరించారు. దీని పైన సీఎం జగన్ మొదలు వైసీపీ నేతలు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.

నాడు పవన్ - తాజాగా కవిత వ్యాఖ్యలతో
వైసీపీ నేతల ప్రవర్తనకు చెప్పు చూపించక ఏం చేయాలంటూ తిరిగి జనసేన నేతలు ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో పవన్ కల్యాణ్ బస చేసిన హోటల్ వద్దకు వెళ్లి సమావేశమయ్యారు. విశాఖ పర్యటనలో జరిగిన పరిణామాలతో పవన్ కు సంఘీభావం ప్రకటించారు. ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరం కలిసి పోరాడుతామని ప్రకటించారు. ఆ ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపుకు నాందిగా నిలిచింది.

టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడి కామెంట్స్
ఇక, తాజాగా తెలంగాణలో టీఆర్ఎస్ వర్సస్ బీజేపీ రాజకీయ యుద్దం చెప్పు తో కొడతా అనే వరకు వెళ్లింది. ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపైన కవిత సీరియస్ అయ్యారు. తన గురించి మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానంటూ హెచ్చరించారు. రాజకీయంగా ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చ జరిగాయి. ఇక, ఇప్పుడు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ..టీటీడీపీ మాజీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు కీలక వ్యాఖ్యలు చేసారు. చెప్పులంటే వారికి అంత చులకనా అంటూ ప్రశ్నించారు. ఆ భాష కుల అహంకారాన్ని బయట పెట్టిందని వ్యాఖ్యానించారు.

పవన్ పేరు ప్రస్తావించకపోయినా..
చెప్పులను అవహేళన చేయడాన్ని ఖండించారు. చెప్పుతో కొట్టండి, చెప్పుతో కొడతాననడం లాంటి భాషను ఉపయోగిస్తున్నవారిది అల్ప బుద్ధి అని, ఒక సామాజిక వర్గాన్ని అవమానించటమేనని చెప్పుకొచ్చారు. ఇకనుంచి ఎవరైనా చెప్పుల భాష మాట్లాడితే సామాజిక బహిష్కరణ తప్పదని హెచ్చరించారు. తక్షణమే సీఎం కేసీఆర్, కవిత భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. అయితే, బక్కని నర్సింహులు ఎక్కడా పవన్ పేరు ప్రస్తావన చేయకపోయినా.. తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో చర్చకు కారణమయ్యాయి.












Click it and Unblock the Notifications