కేఈ నుంచి ప్రాణహాని.. మాకేం జరిగినా ఆయనదే బాధ్యత: నారాయణరెడ్డి భార్య
తమ కుటుంబానికి ఏం జరిగినా.. కేఈ కృష్ణమూర్తిదే బాధ్యతని శ్రీదేవి రెడ్డి పేర్కొన్నారు. రాజకీయల లబ్ది కోసమే తమ కుటుంబాన్ని కేఈ కుటుంబం వేధిస్తోందని వాపోయారు.
కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ ఇన్ చార్జీ నారాయణరెడ్డి హత్య కేసులో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హస్తంపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. నారాయణరెడ్డి కుటుంబం సహా వైసీపీ నేతలంతా ఆయన వైపే వేలెత్తి చూపించారు. కేఈ మాత్రం ఈ హత్యకు తన కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలో తాజాగా నారాయణరెడ్డి భార్య శ్రీదేవి రెడ్డి కేఈపై మరోసారి ఆరోపణలు చేశారు. తన భర్త హత్యకు కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబే కారణమని ఆరోపించారు. కేఈ కృష్ణమూర్తి అక్రమాలపై పోరాడినందుకే తన భర్తను బలితీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేఈ కుటుంబం నుంచి తనకు కూడా ప్రాణహాని ఉందని శ్రీదేవి రెడ్డి పేర్కొనడం గమనార్హం.
తమ కుటుంబానికి ఏం జరిగినా.. కేఈ కృష్ణమూర్తిదే బాధ్యతని శ్రీదేవి రెడ్డి పేర్కొన్నారు. రాజకీయల లబ్ది కోసమే తమ కుటుంబాన్ని కేఈ కుటుంబం వేధిస్తోందని వాపోయారు. తన భర్త హత్య కేసులో పోలీసులు హంతకులకు మద్దతుగా నిలుస్తున్నారని, నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. పత్తికొండ నియోజకవర్గంలో నారాయణరెడ్డి ఎంతో పేరు సంపాదించుకున్నారని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని గుర్తుచేశారు.