ఆ మూడు నియోజకవర్గాల్లో జనసేన, వైసీపీ హోరాహోరీ
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2019 ఎన్నికల్లో మొత్తం 175 నియోజకవర్గాలకుగాను వైసీపీ 151 సీట్లు గెలుచుకొని సంచలనం సృష్టించింది. తెలుగుదేశం పార్టీ 23, జనసేన ఒక నియోజకవర్గాన్ని దక్కించుకున్నాయి. జనసేనాని పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక నుంచి పోటీచేసినప్పటికీ ఆయనకు ఓటమి తప్పలేదు. ఆ రెండు నియోజకవర్గాల్లోను వైసీపీ విజయకేతనం ఎగరవేసింది.

ఉమ్మడి ఉభయ గోదావరులపై ప్రత్యేక దృష్టి
మూడు సంవత్సరాల సమయం గడిచిన తర్వాత జనసేన ఆ రెండు నియోజకవర్గాలే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో తన ప్రాబల్యాన్ని విస్తరించింది. ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో ఉన్న మెజారిటీ సీట్లు సాధించైనా రాష్ట్రంలో కింగ్ మేకర్ అవ్వాలనే ఆలోచనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారు. అందుకు తగ్గట్లుగా ఆయన ఈ రెండు జిల్లాలపై ఎక్కువ దృష్టి సారించారు. గతంలో ఇక్కడ పర్యటించిన సమయంలో కూడా తూర్పు గోదావరి ప్రజలు తలుచుకుంటే తాను ముఖ్యమంత్రిని అవడం పెద్ద కష్టమేం కాదని వ్యాఖ్యానించారు.

పొత్తు కుదిరితే ఓకే.. లేదంటే..
కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న ఈ రెండు జిల్లాల్లో కాపులతోపాటు క్షత్రియులను దరిచేర్చుకోవడంతోపాటు తనకు ఉన్న అభిమానబ లం తోడైతే సులువుగా మెజారిటీ సీట్లు దక్కించుకోవచ్చనే యోచన చేస్తున్నారు. గాజువాక, భీమవరం కాకుండా గత ఎన్నికల్లో తెలుగుదేశం అరకు, రాజోలు, నరసాపురంలో కూడా మూడోస్థానానికి పరిమితమైంది. నరసాపురంలో జనసేన బలంగా ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఒకవేళ పొత్తు కుదిరితే ఈ నియోజకవర్గంలో పవన్ పోటీచేయడం లేదంటే జనసేనకు ఇవ్వడం జరుగుతుందంటున్నారు.

అరకులో ప్రభావం చూపిస్తోన్న ఇండిపెండెంట్లు
రాజోలులో కూడా అలాంటి పరిస్థితే ఉంది. పంచాయితీ ఎన్నికల్లో జనసేన ఇక్కడ తన ఉనికిని బలంగా చాటుకుంది. ఇక్కడి నుంచి గెలిపించుకున్న ఏకైక ఎమ్మెల్యే వైసీపీకి అనుబంధ సభ్యుడిగా మారడంతో ఈసారి ఇంకా కసిగా జనసేన శ్రేణులు పనిచేస్తున్నాయి. దీంతో జనసేన, వైసీపీ మధ్యే పోరు నడుస్తోంది. మంత్రిగా పనిచేసిన కిడారి శ్రావణ్ అరకు నియోజకవర్గానికి జరిగిన గత ఎన్నికల్లో ప్రభావం చూపించలేక మూడోస్థానానికి పరిమితమయ్యారు. అరకులో వరుసగా 2014, 19 రెండు ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. రెండు ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు 25వేలకు పైచిలుకు ఓట్లు సాధించడం గమనార్హం. ఒక్క గాజువాకలోనే టీడీపీ పరిస్థితి మెరుగుపడిందంటున్నారు. గాజువాక, అరకును మినహాయించినా భీమవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల్లో ఈసారి ఎన్నికల్లో కూడా వైసీపీ, జనసేన మధ్యే ప్రధాన పోరు నడిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications