ఎమ్మెల్సీ అనంతబాబుకు మూడురోజుల బెయిల్
వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కు రాజమండ్రి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇది మూడురోజులపాటే చెల్లుబాటవుతుంది. అనంతబాబు తల్లి మంగారత్నం కొద్దిరోజులుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ కాకినాడ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఆదివారం రాత్రి మృతిచెందడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు రూ.25వేల పూచీకత్తు, ఇద్దరి జామీనుతో కోర్టు ఎమ్మెల్సీకి బెయిల్ మంజూరు చేసింది.
తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం ఆయన 25వ తేదీన తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. కార్యక్రమం పూర్తయ్యేవరకు మూడురోజులు ఆయన ఎల్లవరం గ్రామంలోనే ఉండాలి. అంత్యక్రియల సమయంలో ఆయన పక్కన పోలీసులు కూడా ఉంటారు. కేసు గురించి ఎవరి దగ్గరా ప్రస్తావించకుండా ఉండాలనే షరతును కోర్టు విధించింది.
తన మాజీ కారు డ్రైవర్, దళిత యువకుడు సుబ్రమణ్యంను హత్యచేసిన కేసులో 90 రోజులుగా అనంతబాబు సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయనపై పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీటు లోపభూయిష్టంగా ఉందంటూ రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం కొట్టేసింది. పోలీసులు కావాలనే ఉద్దేశపూర్వకంగా ఛార్జిషీటును అసంపూర్తిగా వేస్తున్నారని, ఎమ్మెల్సీని కాపాడటానికే ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి.