ఆగి ఉన్న బస్సు కిందికి దూసుకెళ్లిన కారు: ముగ్గురు మృతి
ఒంగోలు: అతి వేగంగా వెళ్తూ ఓ కారు ఆగి ఉన్న బస్సును ఢీకొట్టి, దాని కిందికి దూసుకుని వెళ్లింది. ఆ ఘోర రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెంకట్రాజు పాలెం బస్టాండ్ సమీపంలో శనివారంనాడు జరిగింది.
కందుకూరుకు చెందిన పువ్వా యోహాన్ బాబు (44) ఒంగోలులోని రామనాయుడు ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాడు. అతను శనివారం ఉదయం తన స్నేహితుడు మురళి (35)తో కలిసి కారులో కందుకూరు నుంచి ఒంగోలు బయలుదేరాడు. కారు వెంకట్రాజుపాలెం వద్దకు రాగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న శ్రీ హర్షిమి కళాశాలకు చెందిన బస్సును ఢీకొట్టింది.
విద్యార్థులను ఎక్కించుకోవడానికి డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపాడు. అయితే, కారు వెనక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యోహాన్ బాబు, మురళిలతో పాటు డ్రైవర్ షేక్ బాబు అక్కడికక్కడే మరణించారు. వెంకట్రావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికులు ప్రమాదానికి గురైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ముగ్గురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శవాలను ఒంగోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.