కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు అక్కడికక్కడే మృతి...
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం(డిసెంబర్ 10) తెల్లవారుజామున జగ్గయ్యపేట మండలంలోని గరికపాడు ఫ్లైఓవర్పై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
గాయపడిన వారిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మృతులను మాచర్ల శ్యామ్(60),శారద(55),శ్యామల(38)లుగా గుర్తించారు. భాగ్యలక్ష్మీ,మాన్యశ్రీ(7),గోపి(8),అక్షయ్,సైదులు గాయాలపాలైనట్లు తెలిపారు.
బాధితులను ఖమ్మం జిల్లా ఆత్కూరు వాసులుగా గుర్తించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడకు వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మూడు రోజుల క్రితం ఇదే కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం బొమ్ములూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రోడ్డు పక్కన ఆగి వున్న లారీని ఓ కారు అతివేగంతో వెనుక నుంచి ఢీకోట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జవడంతో మృతదేహాలు అందులోనే ఇరుక్కుపోయాయి.
ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని క్రేన్ సహాయంతో మృతదేహాలను కారు నుంచి బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా భీమవరంలో ఓ వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. మృతులను చీమకుర్తి నాగేశ్వరవు, తాతారావు, కనకదుర్గ రావులుగా గుర్తించిన పోలీసులు.. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.
Recommended Video
మృతుల్లో ఒకరు విజయవాడ వాసిగా,మరో ఇద్దరు చింతలపూడి మండలం ఎర్రగొండపల్లెకి చెందినవారిగా గుర్తించారు.ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోగా... పోలీసులు ట్రాఫిక్ని క్లియర్ చేశారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications