సిటీలో అల్లర్లు: పోలీసు కాల్పుల్లో 3గురు మృతి, కర్ఫ్యూ
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అవాంఛనీయమైన సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాదులోని రాజేంద్రనగర్ ప్రాంతంలో బుధవారంనాడు ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ విషయాన్ని డిజిపి ప్రసాదరావుతో పాటు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్, హైదరాబాదు పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ధ్రువీకరించారు.
ఘర్షణలు పోలీసు కాల్పులకు దారి తీసినట్లు తెలుస్తోంది. పోలీసు కాల్పుల్లో ముగ్గురు మరణించినట్లు ఆ పోలీసు అధికారులు చెప్పారు. రాజేందగ్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో నిరవధిక కర్ఫ్యూ విధించారు. కిషన్ బాగ్ పరిసర ప్రాంతాలకు ప్రజలు రావద్దని సివి ఆనంద్ సూచించారు. ఈ ఘటనలో మరో తొమ్మిది మంది గాయపడ్డారు.

రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయని, వాటిని అదుపు చేసే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారని ప్రసాదరావు చెప్పారు. తమకు సంబంధించి వ్యతిరేకంగా ప్రవర్తించారనే ఆగ్రహంతో ఒక వర్గానికి చెందినవారు మరో వర్గం వారి ఇళ్లపై, దుకాణాలపై దాడి చేశారు. దీంతో అల్లర్లు ప్రారంభమయ్యాయి.
రాజేంద్ర నగర్ ప్రాంతంలో పరిస్థితి అదుపులో ఉందని పోలీసు అధికారులు చెప్పారు. ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని వారు కోరారు. అల్లర్లను అదుపు చేసే క్రమంలో ఇద్దరు పోలీసులకు గాయాలైనట్లు కూడా తెలిపారు. అల్లర్లకు కారణమైనవారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది.












Click it and Unblock the Notifications