శబరి వంతెన పిల్లర్ను ఢీకొట్టి... రెండు ముక్కలైన లాంచీ... ముగ్గురు గల్లంతు...
తూర్పు గోదావరి జిల్లాలో ఓ మోటార్ లాంచీ ప్రమాదానికి గురైంది. చింతూరు వద్ద శబరి వంతెన పిల్లర్ను ఢీకొట్టడంతో లాంచీ రెండు ముక్కలైంది. దీంతో లాంచీలో ఉన్న ముగ్గురు సిబ్బంది గల్లంతైనట్లు సమాచారం. ప్రస్తుతం రెస్క్యూ బృందాలు గల్లంతైనవారి కోసం గాలిస్తున్నాయి. పోలీస్,రెవెన్యూ శాఖ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలకు వెళ్లి తిరిగొస్తుండగా లాంచీ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.
కాగా,భారీ వర్షాల కారణంగా గోదావరి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా మరికొద్దిసేపట్లో మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయ్యే అవకాశాలున్నాయి. ఎగువున ఉన్న తెలంగాణలో భారీ వర్షాల కారణంగా కాళేశ్వరం నుంచి గోదావరికి భారీ వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 51.5 అడుగులకు చేరుకుంది. ఈ రాత్రికి 53 అడుగులకు చేరిన తరువాత మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది.
అంతకుముందు,అగస్టు 13 నుంచి గోదావరికి భారీ వరద పోటెత్తడంతో అగస్టు 16న మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 17వ తేదీ రాత్రి నాటికి గోదావరి 61.6 అడుగుల నీటి మట్టానికి చేరింది. అయితే ఆ తర్వాత క్రమంగా వరద తగ్గుముఖం పట్టడంతో ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించారు. తాజాగా గురువారం(అగస్టు 20) నుంచి మళ్లీ గోదావరికి పోటెత్తడంతో మొదటి,రెండో ప్రమాద హెచ్చరికలు ఇప్పటికే జారీ అయ్యాయి. గోదావరి తీరాన్ని ఆనుకని ఉన్న పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భద్రాచలం, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెంలలో రాకపోకలు నిలిచిపోయాయి. తూర్పు గోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లోనూ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.