చడ్డీ గ్యాంగ్ సభ్యుడిలా.: ఇచ్చిన ఇడ్లీని విసిరేశాడని బిచ్చగాడ్ని తీవ్రంగా కొట్టి చంపారు, ముగ్గురి అరెస్ట్
గుంటూరు: జిల్లాలోని నల్లపాడు పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ముగ్గురు స్నేహితులు కలిసి ఓ బిచ్చగాడిని హత్య చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు సౌత్ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి గురువారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ వ్యక్తి స్థానికంగా బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, మే 1న అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులో ఉన్న మహేష్ అనే వ్యక్తి తనతో తెచ్చుకున్న ఇడ్లీ పొట్లాన్ని బిచ్చగాడికి ఇచ్చాడు. అంతేగాక, నువ్వు చడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యుడిలా ఉన్నావు.. పోలీసులతో జాగ్రత్త అంటూ ఎద్దేవా చేశాడు.
ఆ మాటలతో బాధపడ్డ ఆ బిచ్చగాడు.. మహేష్ ఇచ్చిన ఇడ్లీ పొట్లాన్ని విసిరేశాడు. దీంతో కోపంతో ఊగిపోయిన మహేష్.. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో మరో ఇద్దరు స్నేహితులు అనిల్, సతీష్లతో కలిసి వచ్చాడు. ఆ తర్వాత ఆ బిచ్చగాడిని తీవ్రంగా కొట్టారు. అంతేగాక, బిచ్చగాడిని బైక్పై ఎక్కించుకుని అంకిరెడ్డిపాలెం డొంక రోడ్డులోకి తీసుకెళ్లారు. అక్కడే పడేసి మరోసారి తీవ్రంగా కొట్టడంతో దెబ్బలకు తాళలేక ఆ బిచ్చగాడు ప్రాణాలు వదిలాడు.
అనంతరం నిందితులు మహేష్, అనిల్, సతీష్లు అక్కడ్నుంచి పరారయ్యారు. అయితే, బిచ్చగాడి మృతిని అనుమానిత మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు పోలీసులు. చివరకు నిందితులైన మహేష్, అనిల్, సతీష్లను నిందితులుగా తేల్చారు పోలీసులు. మద్యం మత్తులోనే యాచకుడ్ని కొట్టి చంపినట్లు నిందితులు అంగించారు. నిందితులను అరెస్ట్ చేశామని, కోర్టులో హాజరుపరిచి శిక్షపడేలా చేస్తామని పోలీసులు తెలిపారు.