జగన్ పాదయాత్ర ముగిసి మూడేళ్లు: ఇచ్ఛాపురం వద్ద ఇదేరోజు..నవరత్నాల రూపకల్పనకు బీజం
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రతిపక్ష నేత హోదాలో తలపెట్టిన సుదీర్ఘ పాదయాత్ర ముగిసి ఇవ్వాళ్టితో మూడు సంవత్సరాలు పూర్తి కానుంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో.. ప్రతిపక్ష నేతగా ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి 3,648 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు. వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలోని ఇడుపుల పాయలో గల వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆరంభమైన 2017 నవంబర్ 6వ తేదీన ఆరంభమైన ఈ పాదయాత్ర 2019 జనవరి 9వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగిసింది.
3,648 కిలోమీటర్లు..
తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తొలి అడుగు వేశారు. ప్రజల సమస్యలు వింటూ 341 రోజుల పాటు పాదయాత్ర చేశారు. 3,648 కిలోమీటర్ల దూరం నడిచారు. 2,516 గ్రామాల గుండా ఈ పాదయాత్ర సాగింది. 134 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. 124 బహిరంగ సభలను నిర్వహించారు. నేను విన్నాను.. నేను ఉన్నాను అనే నినాదంతో ఈ పాదయాత్రను చేపట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
ఇచ్ఛాపురం వద్దే ఇదే రోజు..
2019 జనవరి 9వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని ఒడిశా సరిహద్దు పట్టణం ఇచ్ఛాపురం వద్ద పాదయాత్రను ముగించారు. భారీ పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం అక్కడి నుంచి రైలులో నేరుగా తిరుపతికి చేరుకున్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం మీదుగా కాలినడకన తిరుమలకు వచ్చారాయన. అదే సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. 151 అసెంబ్లీ, 22 లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంది.
నవరత్నాల రూపకల్పనకు
పాదయాత్ర సందర్భంగా ప్రజల నుంచి అందిన విజ్ఞప్తులు, వారి కోరికల ఆధారంగా నవరత్న పథకాలను రూపొందించుకోగలిగింది వైఎస్ఆర్సీపీ. రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి రైతు భరోసా, పేద కుటుంబాల వారికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యచికిత్సను అందించడానికి ఆరోగ్యశ్రీ, తన పిల్లలను బడికి పంపించే కుటుంబానికి ఆర్థిక సహకారాన్ని అందించడానికి అమ్మఒడి, సామాజిక భద్రత కింద మంజూరు చేసే పింఛన్ల పెంపు, పేదలందరికీ ఇళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం, సంపూర్ణ మద్యపాన నిషేధం వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత పథకాలను అమలు చేస్తామని మెనిఫెస్టోలో పొందుపరిచింది.
తొలి ఏడాదే హామీల అమలుకు ప్రాధాన్యత..
అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరం నుంచే వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం.. వాటిని అమలు చేస్తూ వస్తోంది. ఇదొక కొత్త సంప్రదాయంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అధికారంలోకి వచ్చిన పార్టీ తన ఎన్నికల హామీలను నెరవేర్చడానికి కొంత సమయం తీసుకుంటుందని, దీనికి భిన్నంగా వైఎస్ఆర్సీపీ ఓ కొత్త సంప్రదాయానికి తెర తీసిందని అంటున్నారు. తాను ఎదుర్కొనబోయే తదుపరి అసెంబ్లీ ఎన్నికల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా.. మెనిఫెస్టో అమలుకు ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేస్తోన్నారు.
సోషల్ మీడియాలో ట్రెండింగ్..
వైఎస్ జగన్ పాదయాత్ర మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు #3YearsForPrajaSankalpaYatra అనే హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తోన్నారు. వైఎస్ జగన్తో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తోన్నారు. పాదయాత్ర సందర్భంగా ఆయన వేసిన ఒక్కో అడుగు.. పేదల ప్రజల కష్టాలను తీర్చడానికి కారణమైందని, ఘన విజయాన్ని అందించిందని చెబుతున్నారు. ఇప్పటి ప్రజారంజక పాలనకు ఊపిరి పోసిందంటూ సంతోషాన్ని పంచుకుంటోన్నారు.