చంద్రబాబు ప్రతిష్ట తెబ్బతీసే కుట్ర: అరెస్టుపై తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర స్పందన
ఖమ్మం: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టును తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టుపై పలువురు ఏపీ, తెలంగాణ నేతలు స్పందించగా.. తాజాగా తుమ్మల స్పందించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుపై.. అసత్యాలతో కట్టుకథలతో అరెస్టు చేయడం దారుణమని అన్నారు తుమ్మల నాగేశ్వరరావు. కనీస న్యాయ సూత్రాలు పాటించకుండా మాజీ ముఖ్యమంత్రి పట్ల అమర్యాదగా వ్యవహరించడం సరికాదన్నారు. చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికమని.. ఆయన ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర చేశారని తుమ్మల అన్నారు.

రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ రాజకీయ కక్షతో చంద్రబాబు పట్ల వ్యవహరించిన తీరు దుర్మార్గమని తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. మరోవైపు, చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెలంగాణలోని టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలను నిర్వహించాయి. హైదరాబాద్ ట్యాంక్బండ్ వద్ద పార్టీ నేత బక్క నర్సింహులు ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళన చేశారు.
చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలోని దోమలగూడ టీడీపీ కార్యాలయం దగ్గర ఏపీ సీఎంపై వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.కూకట్పల్లి జేఎన్టీయూ కూడలి వద్ద పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఖమ్మం, వరంగల్, నల్గొండతోపాటు పలు జిల్లాల్లో టీటీడీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి.
కాగా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును శనివారం ఉదయం నంద్యాలలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విజయవాడకు తరలించారు. ఆదివారం తెల్లవారుజామున వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు సీఐడీ అధికారులు.
ఏసీబీ కోర్టులో సీఐడీ రిమాండ్ రిపోర్టు సమర్పించింది. కాగా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏ37గా చంద్రబాబును చేరుస్తూ రిమాండ్ రిపోర్టు సమర్పించింది సీఐడీ. రూ. 371 కోట్ల కుంభకోణం జరిగిందని అభియోగం మోపింది. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ అక్రమాలు జరిగాయని తెలిపింది.
తాడేపలల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంగా అక్రమాలు జరిగాయని, 2021 డిసెంబర్ 9 కంటే ముందు నేరం జరిగిందని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ప్రజాప్రతినిధిగా ఉండి చంద్రబాబు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారన్న సీఐడీ. చంద్రబాబు ముఖ్యమైన కుట్రదారని పేర్కొన్నారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు పేరు మీద రిమాండ్ రిపోర్టు సమర్పించారు. 15 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ ఇవ్వాలని సీఐడీ కోర్టును కోరింది.
చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్వయంగా వాదనలు వినిపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని అన్నారు.












Click it and Unblock the Notifications