బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్
ఏపీలో రోజురోజుకూ ఎండ తీవ్రత అధికమౌతోంది. ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నడి వేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఉపరితల ఆవర్తనం వల్ల మొన్నటివరకు వర్షాలు పడ్డాయి గానీ ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.
ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దిమ్మతిరిగేలా చేస్తోంది. రికార్డుస్థాయిలో టెంపరేచర్ నమోదవుతోంది. 40 డిగ్రీలకు పైగా ఎండ కాయడం సాధారణమైపోయింది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ ఎండలకు వడగాల్పులు తోడవుతున్నాయి. వేడి గాలులు మరింతగా జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో వేడిగాలులు, ఉష్ణోగ్రత పంజా విసురుతున్నాయి.

ఈ పరిస్థితుల మధ్య తీపికబురు అందింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో నేడు, రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో నేడు అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
అదే సమయంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండ, వడగాలులు, ఉక్కపోత తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఈ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని అన్నారు. మరో 29 మండలాల్లో సాధారణ వడగాలులు ప్రభావం చూపుతుందని చెప్పారు. మంగళవారం నాడు 54 మండలాల్లో తీవ్ర, 15 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందని వివరించారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications