ఏపీ ప్రజలకు అత్యవసర సూచన.. 14 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్.. కరోనాపై సీఎం జగన్ ఆదేశాలు
అందరినీ వణికిస్తోన్న కరోనా వైరస్ కు సంబంధించి ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని తెలిపింది. ఆయా జిల్లాల్లో మొత్తం 24 మంది అనుమానితులు ఆస్పత్రుల్లో చేరగా.. వాళ్లలో 20 మందికి కరోనా టెస్టులు నెగటివ్ వచ్చాయని, మిగతా నలుగురికి సంబంధించిన ఫలితాలు రావాల్సిఉందని ప్రకటించింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ శుక్రవారం కరోనా నిరోధంపై ఏర్పాట్లను సమీక్షించారు. భేటీ వివరాలను మీడియాకు వెల్లడించిన అధికారులు.. కొన్ని అత్యవసర సూచనలు చేశారు.

వాళ్లంతా ఈ పని చేయాలి..
ఇతర దేశాల నుంచి వచ్చినవాళ్ల ద్వారానే కరోనా వ్యాప్తి జరుగుతుండటంతో.. ఇటీవల కాలంలో ఏపీకి వచ్చినవాళ్లందరి వివరాలు సేకరిస్తున్నామని, ఇళ్లకు వెళ్లిమరీ వాళ్ల ఆరోగ్యవివరాలు సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. విదేశాలనుంచి వచ్చిన వాళ్లంతా విధిగా 14 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలని, దీన్నొక అత్యవసర సూచనగా భావించాలని చెప్పారు. వ్యక్తిగత శుభ్రత, జాగ్రత్తలతోనే వ్యాధి చాలావరకు నయమవుతుందన్నారు.

ఇతర వ్యాధులు ఉంటేనే...
ఏపీలో ఇప్పటిదాకా 24 మంది అనుమానితుల్ని గుర్తించగా, 20 మందికి వైరస్ లేదని తేలిందన్న అధికారులు.. కేసుల తీవ్రతపై కీలక కామెంట్లు శారు. ‘‘పాజిటివ్గా నమోదైన కేసుల్లో కేవలం 5శాతం మందే ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కరోనా రాకముందునుంచే ఇతర వ్యాధులు ఉన్నవాళ్లు మాత్రమే కొంచెం ఎక్కువగా ఇబ్బందిపడుతున్న దాఖలాలున్నాయి. అనుమానంవస్తే వ్యక్తితోపాటు ఆ ఇంట్లో ఉన్నవారికి, చుట్టుపక్కల వారిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచుతాం''అని వివరించారు.

అనుమానం వస్తే చాలు.. అంతా చూసుకుంటాం..
కరోనా వ్యాప్తి నేపథ్యంలో విశాఖపట్నం ఎయిర్పోర్టులో గురువారం నాటికి మొత్తం 6,927 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించామని, అలాగే నౌకల ద్వారా వచ్చేవాళ్లను కూడా పరీక్ష జరిపిన తర్వాతే వదులుతున్నామని అధికారులు చెప్పారు. వైజాగ్ పోర్టులో 790, గన్నవరంలో 60, కృష్ణపట్నం పోర్టులో 469 మందికి స్క్రీనింగ్ నిర్వహించామన్నారు. విజయవాడ, అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో కరోనా బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, అనుమానిత లక్షణాలున్నట్లు ఉన్నాయని ఎవరైనా కాల్చేస్తే.. ఆ తర్వాత బాధ్యత మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుందని, అంబులెన్సుల్లో రోగిని తరలించిన వెంటనే వాహనానికి స్టెరిలైజ్ చేస్తామని, ఈ మేరకు ప్రోటోకాల్స్ రూపొందించామని అధికారులు వివరించారు.

తెలంగాణకు భిన్నంగా..
కరోనా నిరోధానికి రాష్ట్ర యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తున్నదని, మరింత మెరుగ్గా పనిచేసేందుకు వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నామని అధికారులు చెప్పారు. అన్ని జిల్లాల్లో కలిపి ముందస్తుగా 351 బెడ్లు, 47 వెంటిలేటర్లు, 1.10లక్షల మాస్కులు, 12,444 పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లు సిద్ధం చేశామని, కొత్తగా 12వేల పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్వెప్మెంట్లు, మరో 50వేల మాస్కులు కూడా రిజర్వులో ఉంచుతామన్నారు. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా ఐసోలేషన్ వార్డు ఏర్పాటుపై స్థానికుల్లో వ్యతిరేకత, భయాందోళనలకు వ్యక్తమైన నేపథ్యంలో దాన్నొక అనుభవంగా తీసుకున్న ఏపీ అధికారులు.. రాష్ట్రంలో ఐసోలేషన్ వార్డుల్ని ప్రధాన ఆస్పత్రికి దూరంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

సీఎం జగన్ ఆదేశాలివే..
కరోనాపై సమీక్షలో భాగంగా సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. అన్నిటికంటే ముందుగా, ప్రజలు ఆందోళనలకు గురికవాల్సిన అవసరంలేదన్నభరోసా కల్పించాలని, ఈమేరకు కాల్ సెంటర్ ఏర్పాటు చేసి నిత్యం జనంతో మాట్లాడుతూ ఉండాలని, తగిన జాగ్రత్తలు సూచించాలని తెలిపారు. అనుమానిత కేసులుంటే నిమిషాల వ్యవధిలో టేకప్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలన్నారు. కరోనాపై పోరులో గ్రామ సచివాలయ సిబ్బందిని కూడా భాగస్వాములు చేయాలని, వైరస్ వస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న సమాచారాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లాలని సూచించారు.
Recommended Video


భారీగా నిధులు..
కరోనాకు సంబంధించి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రూ.200 కోట్లు నిధులు సిద్ధంగా ఉంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అలాగే విజయవాడ, అనంతపురంల్లో ప్రత్యేక వార్డుల నిర్వహణకు రూ.60 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కరోనాపై సీఎం సమీక్షలో చీఫ్ సెక్రటరీ నీలంసాహ్ని, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్ తోపాటు ముఖ్య అధికారులందరూ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications