శ్రీవారి దర్శనానికి వెళ్లిన వారికి ఈ విశేష ఉత్సవం తిలకించే ఛాన్స్.. రద్దీ !!
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో రద్దీ నెలకొంది. శని, ఆదివారాల్లో రెండు లక్షలమంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం ఒక్కరోజే 84,873 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. వారిలో 36,286 మంది తలనీలాలు సమర్పించారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.67 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 22 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి.
టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. 4.38 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అలాగే 2.46 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. కాగా శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం నాడు శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు టీటీడీ అర్చకులు. తొలి రోజైన ఆదివారం నాడు వైభవంగా క్రతువులను నిర్వహించారు.

ఇందులో భాగంగా పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు అర్చకులు. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుంగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వేద పండితులు పంచసూక్తాలను పఠించారు. ఆ తర్వాత పవిత్ర ప్రతిష్ట జరిగింది. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు. అనంతరం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలను చేపట్టారు. తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు. రెండో రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా టీటీడీ అర్చకులు నేడు పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.














Click it and Unblock the Notifications