TTD: దర్శన టికెట్ల జారీలో గందరగోళం - తిరుమలలో భక్తుల నిరసన, ఆపై..!!
Tirumala: తిరుమల కొండ అంతా భక్తులతో నిండిపోయింది. వరుస సెలవుల కారణంగా భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి గోగర్భం డ్యామ్ వరకు క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. పెరిగిన రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఈ సమయం లోనే భక్తులు అన్నమయ్య భవన్ ముందు నిరసనకు దిగారు. టికెట్ విక్రయాల్లో గందరగోళం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికారులు వారికి సర్దిచెప్పారు.

తిరుమలలో రద్దీ కొనసాగుతున్న వేళ భక్తులు నిరసనకు దిగారు. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల విక్రయాల్లో గందరగోళం నెలకొంది. తాజాగా శ్రీవాణి దర్శనంలో టీటీడీ ప్రయోగాత్మకంగా మార్పులను ప్రారంభించింది. అదనపు ఈవో కార్యాలయం నుంచి అన్నమయ్య భవనం ఎదుట కొత్తగా ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కేంద్రం వద్ద సమస్యలు ఎదురవుతున్నాయి. శ్రీవాణి దాతలకు సాయంత్రం నాలుగున్నర గంటలకు స్వామివారి దర్శనాన్ని టీటీడీ కల్పిస్తున్నారు. కాగా శ్రీవాణి దాతలకు ఏ రోజుకు ఆ రోజున ఉదయం పదిన్నర గంటలకు టికెట్ల విక్రయాలు చేస్తున్నారు. అయితే శ్రీవాణి టికెట్లకు ఆదరణ ఎక్కువగా ఉండటంతో ముందు రోజు రాత్రి నుంచే భక్తులు బారులు తీరుతున్నారు.
టికెట్ల కోసం ఏర్పడుతున్న రద్దీ దృష్ట్యా ఎప్పటికప్పుడు అధికారులు వేకువజామున టికెట్ల విక్రయాలు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో విజిలెన్స్ సిబ్బందిని చొచ్చుకొని భక్తులు క్యూలైన్లోకి వెళ్లారు. టికెట్లు దొరక్కపోవడంతో కొందరు భక్తులు అన్నమయ్య భవనం ఎదుట నిరసన చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న విజిలెన్స్ అధికారులు సర్దిచెప్పి భక్తులను వెనుకకు పంపించారు. గతంలో శ్రీవాణి టికెట్పై దర్శనానికి 3 రోజుల సమయం పట్టేది. దీంతో ఏ రోజు టికెట్ తీసుకున్న భక్తులకు ఆరోజే దర్శనానికి వీలుగా టీటీడీ మార్పులు చేసింది. దీనిని ఆగస్టు 1 నుంచి ప్రారంభించింది. ఉదయం ఆఫ్లైన్లో శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ పొందిన భక్తులు అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-1 వద్ద రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమలలో ఉదయం 10 గంటల నుంచి మొదటి వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యతగా 800 టికెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 200 టికెట్లు జారీ చేస్తున్నారు. ఆన్లైన్లో మరో 500 టికెట్లు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఆన్లైన్లో టికెట్లు పొందిన భక్తులకు ఉదయం 10 గంటలకే దర్శనం కల్పిస్తున్నారు. శ్రీవాణి టికెట్ కోసం భక్తులు టీటీడీకి రూ. 10,000 విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. అన్నమయ్య భవనం ఎదురుగా ఉన్న శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రంలో టికెట్లను ఇస్తున్నారు. ఇక.. ఇటు టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.












Click it and Unblock the Notifications