తిరుమలలో ఆరాధనా మహోత్సవాలు- తేదీలు ఇవే.. !!
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు 67,678 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 18,173 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.82 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఏడు కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది.
కాగా- కర్ణాటక సంగీత పితామహుడు శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. టీటీడీ దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు మూడు రోజుల పాటు తిరుమల ఆస్థాన మండపంలో ఘనంగా ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.

- మొదటిరోజైన జనవరి 17న తెల్లవారు జామున సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తన కార్యక్రమాలు, పురందర సాహిత్య గోష్ఠి, వివిధ పీఠాధిపతుల మంగళాశాసనాలు, సంకీర్తనమాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటలకు ప్రముఖ పీఠాధిపతులు మంగళా శాసనాలు అందిస్తారు.
- రెండవ రోజున తెల్లవారు జామున 6 గంటలకు అలిపిరి వద్ద పురందరదాసుల విగ్రహానికి పుష్పమాల సమర్పిస్తారు. సాయంత్రం 6 గంటలకు శ్రీవారి ఆలయం నుండి నారాయణగిరి ఉద్యానవనం వరకు శ్రీవారి ఉత్సవమూర్తుల ఊరేగింపు, ఊంజల్సేవ, దాస సంకీర్తన కార్యక్రమాలు ఉంటాయి.
- చివరిరోజున తెల్లవారు జామున సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తన, ఉపన్యాసాలు, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ ఆరాధన మహోత్సవాల్లో భాగంగా ఈ 12వ తేదీ సాయంత్రం 6 గంటలకు తిరుమలలోని పాపవినాశనం రోడ్డు లో గల కళ్యాణమస్తు వేదికపై శ్రీ వేంకటేశ నవరత్న సంకీర్తనా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ పురందరదాసుల వారు శ్రీవేంకటేశ్వర స్వామివారిని స్తుతిస్తూ చేసిన సంకీర్తనలలోని నవరత్నాలను 300 మంది సుప్రసిద్ధ కళాకారులు గోష్ఠిగానం చేయనున్నారు.












Click it and Unblock the Notifications