హిందూ ప్రముఖుల ముందు చంద్రబాబును నిలబెట్టిన జగన్
YS Jagan on Tirumala Laddu row: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిని జంతువుల కొవ్వు, చేప నూనెతో కల్తీ చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో ఉంది వైఎస్ఆర్సీపీ.
ఆలయాల్లో పూజలు..
పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొంటోన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. తిరుమల, శ్రీవారి ప్రసాద పవిత్రతను దెబ్బతీసేలా చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యవహరిస్తోన్నారని, వారు చేసిన పాపాల ప్రక్షాళన కోసం ఆలయాల్లో పూజలను నిర్వహించాలంటూ ఇదివరకే జగన్.. పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు.

తిరుమలకు వెళ్లాలనుకున్నా..
ఆయన స్వయంగా నేడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉన్నప్పటికీ అది సాధ్యపడలేదు. తన పర్యటన సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడులకు కుట్ర పన్నడం, ఆంక్షలను విధించడం, జగన్ పర్యటనలో పోలీసులు తమ పార్టీ నాయకులకు నోటీసులను జారీ చేయడం వంటి కారణాల వల్ల జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారని వైఎస్ఆర్సీపీ చెబుతోంది.
కీలక ప్రెస్ మీట్..
పర్యటన రద్దు తరువాత తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ విలేకరులతో మాట్లాడిన విషయం తెలిసిందే. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం మన తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం, శ్రీవారి ప్రతిష్ఠను దిగజార్చే విధంగా అబద్దాలు చెప్పడం సరికాదంటూ జగన్ చెప్పారు.
చంద్రబాబు తప్పులు ఇవీ..
తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలేననే విషయం ఒక్కొక్కటిగా రుజువు అవుతోందని, 100 రోజుల పాలన వైఫల్యాలను డైవర్ట్ చేయడానికే తిరుమల లడ్డూపై ఆరోపణలు చేశారని జగన్ విమర్శించారు. లడ్డూ విషయంలో కూడా అడ్డంగా దొరికిపోయే సరికి, దానిమీది నుంచి ప్రజల దృష్టిని మళ్లించడాకి కొత్తగా డిక్లరేషన్ అంశాన్ని చంద్రబాబు తెర మీదికి తీసుకొచ్చారని మండిపడ్డారు.

ఆలయాలు..
ఈ సందర్భంగా తాను మాట్లాడిన కీలక అంశాలతో కూడిన 31 నిమిషాల వీడియోను జగన్ కొద్దిసేపటి కిందటే తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దీన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, కాశీ విశ్వనాథ ఆలయం, షిర్డీ సాయిబాబా సంస్థాన్, అయోధ్య రామమందిరం, శృంగేరి మఠం, గోవర్దన మఠం, జ్యోతిర్మఠం, కంచి మఠం, ద్వారకా ఆలయం, పండరీపురం దేవస్థానం, విరాట్ హిందూ సంఘం, బ్రహ్మకుమారీలు, చిన్మయా మిషన్ వంటి ధార్మిక సంస్థలకు ట్యాగ్ చేశారు.
ఆధ్యాత్మిక వేత్తలు..
అలాగే- సద్గురు జగ్గీ వాసుదేవ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సద్గురు శ్రీశ్రీ రవిశంకర్, బ్రహ్మకుమారి శివానీ, స్వామి అవధేశానంద, గౌర్ గోపాల్ దాస్, స్వామి ముకుందానంద, బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణ, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ జయ కిశోరి.. వంటి ఆధ్యాత్మిక వేత్తలకూ దాన్ని పంపించారు.












Click it and Unblock the Notifications