ఏపీలో ఆలయ నిబంధనల్లో అనూహ్య మార్పులు: పట్టు వస్త్రాలు ఎవరు సమర్పిస్తారు?
Chandrababu:ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు.. మతం రంగును పులుముకొన్నాయి. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు, చేపనూనె వాడుతున్నారనే వివాదానికి పుల్స్టాప్ పడక ముందే.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ వివాదం తెర మీదికొచ్చింది.
ఈ రెండింటి మీదే తప్ప పాలనా పరమైన అంశాలేవీ చర్చకు రావట్లేదు చాలా రోజులుగా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అమలు చేస్తానన్న సూపర్ 6 గ్యారంటీలు సహా ఇంకేదీ వార్తల్లో ఉండట్లేదు.

తిరుమల లడ్డూ, జగన్ డిక్లరేషన్ వివాదం తెర మీదికి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రస్తుతం అమలులో ఉన్న ప్రొటోకాల్స్, నిబంధనల్లో సవరణలు చేసింది. బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రత్యేక పర్వదినాల్లో పట్టువస్త్రాలను సమర్పించే ప్రక్రియకు సంబంధించిన మార్పులు అవి. తాజా ప్రొటోకాల్ ప్రకారం ఇకపై ఆ పట్టు వస్త్రాలను దేవదాయ శాఖ మంత్రి లేదా సంబంధిత ఆలయం ఉన్న జిల్లా మంత్రి మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది.
పట్టువస్త్రాల సమర్పణతో పాటు ఆలయాల్లో నిర్వహించే పర్వదినాలకు ఖర్చు చేసే మొత్తాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా కామన్ గుడ్ ఫండ్ నుంచి వినియోగించుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను రెవెన్యూ (దేవాదాయం) శాఖ జారీ చేసింది.
సాధారణంగా తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు సహా ఒంటిమిట్టలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాలు, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా నవరాత్రి మహోత్సవాల సమయంలో ముఖ్యమంత్రే స్వయంగా రాష్ట్ర ప్రజల తరఫున పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే.
తాజాగా నిబంధనల ప్రకారం- ఆయా ఆలయాల్లో ఎవరు పట్టువస్త్రాలను సమర్పిస్తారనేది చర్చనీయాంశమౌతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం.. దేవాదాయ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండదు. అది స్వతంత్ర ప్రతిపత్తి హోదా ఆలయం. తాజా ప్రొటోకాల్స్ నిబంధనలు టీటీడీకి వర్తించకపోయినా మిగిలిన ఆలయాల్లో దేవాదాయ శాఖ మంత్రే పట్టువస్త్రాలను సమర్పించే అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications