తిరుమల ప్రతిష్ట మంటగలిసేలా చంద్రబాబు రాజకీయం.. కొడాలి నాని ధ్వజం!
తిరుమల శ్రీవారి లడ్డుని ఏపీలో జగన్ సర్కార్ హయాంలో కల్తీ చేశారని సీఎం చంద్రబాబు చేసిన సంచలన ఆరోపణలతో రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగానూ పెద్ద దుమారం మొదలైంది. హిందువుల మనోభావాలను దెబ్బతీశారని తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ ఈ వ్యవహారంపైన దర్యాప్తు చేయడానికి చంద్రబాబు సిట్ ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు పైన వైసిపి నేతలు మాజీ మంత్రులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
తిరుమల ప్రతిష్ట మంట కలిసేలా చంద్రబాబు రాజకీయం
తిరుమల లడ్డు వ్యవహారం పై తాజాగా మాట్లాడిన మాజీ మంత్రి కొడాలి నాని తిరుమల ప్రతిష్ట మంట కలిసేలా ఆలయాన్ని రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి చంద్రబాబు లాగారని మండిపడ్డారు. చంద్రబాబును దేవుడు కూడా క్షమించడని ఆయన పేర్కొన్నారు. సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో తాజాగా కూడా నెయ్యి ట్యాంకర్లు వెనక్కు వెళ్ళాయని, ఆ నెయ్యి కూడా వాడలేదని ఆయన తెలిపారు.

వైసీపీ హయాంలో 18సార్లు నెయ్యి ట్యాంకర్లు వెనక్కు
గతంలో కొన్ని వందల సార్లు ఇలానే నెయ్యిని వెనక్కి పంపడం జరిగిందని పేర్కొన్న కొడాలి నాని జగన్ ను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు తిరుమలను రాజకీయాలలోకి తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో క్వాలిటీ లేని నెయ్యి 18 సార్లు వెనక్కి పంపించడం జరిగిందని పేర్కొన్న కొడాలి నాని చంద్రబాబు కేవలం రాజకీయాల కోసం ఇదంతా చేస్తున్నారంటూ మండిపడ్డారు.
దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు
దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేందుకు చంద్రబాబు దిగజారారని విమర్శలు గుప్పించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ట ఉన్న తిరుమల వెంకటేశ్వర స్వామిని చంద్రబాబు రోడ్డు మీదకి ఈడ్చారంటూ కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు బుద్ధి రావాలని, ప్రసాదంలో ఏ తప్పు జరగలేదని భక్తులకు తెలియాలని కొడాలి నాని పేర్కొన్నారు. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని మత రాజకీయాలు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు.
చంద్రబాబుకు కొడాలి నాని సవాల్
జగన్ ను ఎదుర్కోవాలంటే చంద్రబాబు డైరెక్ట్ గా రావాలని సవాలు విసిరారు. మతాలను, కులాలను విచ్చిన్నం చేసేందుకు పెద్ద కుట్ర చేస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్ చంద్రబాబు లోకేష్ సిట్ అంటే కూర్చునే పోలీస్ ఆఫీసర్ తో విచారణ ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు.
ఏ ఎంక్వైరీ కైనా తాము సిద్ధం
ఈ వ్యవహారంలో ఎటువంటి ఎంక్వయిరీ కైనా తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్ ప్రధానికి, సుప్రీం కోర్టుకు కూడా లేఖలు రాసారని కొడాలి నాని తెలిపారు. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం అపవిత్రమైందని చెప్పడం వెనక జగన్ ను ఇబ్బంది పెట్టడం తప్ప, మరే ఉద్దేశం లేదని కొడాలి నాని సంచలన ఆరోపణలు చేశారు.












Click it and Unblock the Notifications