శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో హై అలర్ట్.. వివాదాల నడుమ అధికారులు..
కోరి కొలిచిన వారికి కొంగు బంగారం, కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. ఈనెల 30 నుండి అత్యంత ఘనంగా నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సెప్టెంబర్ 24న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వారు తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. 29న ఉత్సవాలకు అంకురార్పణ చేసి 30వ తేదీ నుండి అక్టోబర్ 8వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు అత్యంత ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.
తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలకు 30 న జగన్
బ్రహ్మోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని, అన్నిటికంటే భద్రత కే పెద్ద పీట వేస్తున్నామని టీటీడీ ఆలయ ఈవో సింఘాల్ తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వామివారికి ఈనెల 30న పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 12 రకాల పుష్పాలను 40 టన్నులను తెప్పిస్తామని , స్వామివారి అలంకరణకు ఉపయోగిస్తామని ఆయన పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు గా ఆలయ ఈవో ప్రకటించారు.
భక్తుల భద్రతే తొలి ప్రాధాన్యం అన్న ఆలయ ఈవో సింఘాల్
బ్రహ్మోత్సవాల సమయంలో లక్షలాది గా తరలి వచ్చే భక్తుల కోసం భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. అంతేకాదు బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామని ఆలయ ఈవో తెలిపారు. విఐపి బ్రేక్ దర్శనాలు సైతం ప్రోటోకాల్ వున్న వ్యక్తులకు మాత్రమే పరిమితమని సింఘాల్ పేర్కొన్నారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు భద్రత కల్పించడం నేతలు ప్రాధాన్యంగా పరిగణిస్తామని చెప్పిన సింఘాల్ దాని కోసం ఇప్పటికే జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకున్నట్లుగా పేర్కొన్నారు.
గదుల విషయంలో , దర్శనాల విషయంలో ఆంక్షలు
తిరుపతి అర్బన్ ఎస్పీ పరిధిలోని 3,100 మంది పోలీసు సిబ్బంది రోజువారీ భద్రతా విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. ఇక గరుడ సేవ రోజు మాత్రం 4,200 మంది విధుల్లో ఉంటారని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఎక్కడికక్కడ నిఘా వ్యవస్థను పటిష్టం చేశామని పేర్కొన్నారు. తిరుమలలో అడ్వాన్స్ బుకింగ్ కోసం 2 వేల గదులు, కరెంట్ బుకింగ్ కోసం 3,200 గదులు కేటాయించేవారమని, కానీ బ్రహ్మోత్సవం సమయంలో భక్తుల రద్దీ దృష్ట్యా అడ్వాన్స్ బుకింగ్ గదుల సంఖ్యను 50 శాతానికి తగ్గిస్తున్నామని పేర్కొన్నారు. ఇక వీఐపీ దర్శనాలు ప్రోటోకాల్ ఉన్నవారికే పరిమితం చేశారు.
తెలంగాణా సీఎం కు ఆహ్వానం .. శోభాయమానంగా తిరుమల
ఇక స్వామీ వారి బ్రహ్మోత్సవాలకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించిన ఆలయ అధికారులు, టీటీడీ పాలకమండలి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అట్టహాసంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇక అలాగే తెలంగాణా సీఎం కేసీఆర్ ను కూడా స్వామీ వారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు టీటీడీ చైర్మన్ వై వీ సుబ్బా రెడ్డి . స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు దగ్గర పడుతున్న సమయంలో తిరుమల శోభాయమానంగా ముస్తాబవుతుంది.
ఒకపక్క వివాదాలు మరోపక్క బ్రహ్మోత్సవాలు
తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని ఇంత జరుగుతుంటే, మరోపక్క వివాదాలు బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరుగుతాయి అన్నదానిపై ఉత్కంఠను రేకెత్తిస్తాయి. టిటిడి పాలకమండలి సభ్యుల ఎంపిక నుండి, ప్రత్యేక ఆహ్వానితులు ప్రమాణస్వీకారం వరకు చెలరేగిన వివాదాలు టిటిడి ని సందిగ్దంలోకి నెట్టాయి. ఇక ఇప్పుడు తాజాగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, టీటీడీ పాలకమండలి తప్పులను ప్రతిపక్షాలు ఏవిధంగా టార్గెట్ చేస్తాయో అన్న ఉత్కంఠ నెలకొంది.