Tirumala: తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు, స్వామి వారికి దోష నివారాణ పూజలు, దేవుడు కరుణించాలి !
తిరుమల/ తిరుపతి: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలకు శ్రీకారం చుట్టారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 18 నుంచి 20వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం శ్రీవారి మూలవిరాట్ ఎదుట ఆచార్య ఋత్విక్వరణం నిర్వహించారు. భగవంతుని ఆజ్ఞ మేరకు అర్చకులకు బాధ్యతల కేటాయింపునే ఋత్విక్వరణం అంటారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
Recommended Video
15వ శతాబ్దాల కాలం నాటి ఆచారం
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, టీటీడీ సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.
శ్రీవారి పవిత్రోత్సవాలు
శ్రీవారి పవిత్రోత్సవాలకు మంగళవారం రాత్రి 8 నుంచి 9 గంటల నడుమ అంకురార్పణం జరుగింది. ముందుగా సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు సేనాధిపతివారిని ఆలయం నుండి వసంతమండపంలోకి వేంచేపు చేసి మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకుని పవిత్రమండపంలోని యాగశాలలో అంకురార్పణ వైదిక కార్యక్రమాలు చేపడతారు.
నాలుగు మాడ వీధుల్లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి
ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
దోష నివారాణ పూజలు
పవిత్రోత్సవాలను, దోష నివారణ', సర్వయజ్ఞ ఫలప్రద, సర్వదోషోపశమన, సర్వతుష్టికర, సర్వకామప్రద తదితర పేర్లతో పిలుస్తారు. పవిత్రం, ఉత్సవం అనే రెండు పదాల కలయిక వల్ల పవిత్రోత్సవం ఏర్పడింది. చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీస్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికిగాను శ్రేష్ఠమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవమొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం.
20 మూరల పట్టుదారం
పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారంగానీ లేదా 200 మూరల నూలుదారం గానీ ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దకం చేస్తారు. ఆలయ మొదటి ప్రాకారంలో గల వగపడి వరండాలో ఉత్తరం వైపున రాతి గోడపై పవిత్రోత్సవాల లెక్కలకు సంబంధించిన పురాతన శాసనం లభ్యమైంది. పవిత్ర తిరునాల్ పేరిట నిర్వహించిన ఈ ఉత్సవాల్లో ఉపయోగించిన వస్తువుల జాబితా, వాటి ధరల వివరాలున్నాయి. శ్రీవారి పవిత్రోత్సవాల అంకురార్పణ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈఓ ఎవీ. దర్మారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ రమేష్ బాబు. షేష్కార్ శ్రీ హరి, టీటీడీ అర్చకులు, అధికారులు పాల్గోన్నారు. కోవిడ్ నియమాలు పాటిస్తూ భక్తులు ఎక్కువ మంది ఈ ఉత్సవాలలో పాల్గోనడానికి అవకాశం చిక్కలేదు.