తిరుమలకు అనూహ్య తాకిడి
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం నాడు ఏకంగా 90,211 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 43,346 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.11 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 24 నుంచి 26 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

వేసవి సెలవుల కారణంగా గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. ఈ క్రమంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. వైకుంఠం కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల కోసం టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాదం, మంచినీటిని అందజేసే ఏర్పాట్లు చేసింది.
మే నెలలో 24 రోజుల వ్యవధిలో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతో పాటూ ఇతర అన్నప్రసాద కేంద్రాల్లో కలిపి 51 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ జరిగింది. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూలైన్లలో మరో 20 లక్షల మందికి పాలు, టీ, కాఫీ, మజ్జిగ, స్నాక్స్ పంపిణీ చేశారు.
మే నుంచి ప్రతిరోజూ సగటున 2.5 లక్షల అన్నప్రసాదాలు, 90,000కు పైగా అల్పాహారాలు, పానీయాలు అందిస్తోన్నారు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు. మే 24న ఒక్కరోజే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో 93,950 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
అదే రోజు బయట క్యూలైన్లు, వైకుంఠం ప్రాంతాల్లో 2.72 లక్షల అన్నప్రసాదాలు, 1.17 లక్షల మంచినీటి అందించారు. క్యూలైన్లలో నిరంతరాయంగా మంచినీటి సరఫరా, పరిసరాల పరిశుభ్రతను టీటీడీ ఆరోగ్య విభాగం నిర్వహిస్తోంది. మొత్తం 2,150 మంది శానిటరీ కార్మికులు, సూపర్ వైజర్లు, ఇన్స్పెక్టర్లు, యూనిట్ అధికారులు భక్తుల కోసం 24 గంటలు సేవలు అందిస్తోన్నారు.
తిరుమలలో ప్రతిరోజూ దాదాపు 3,000 మంది శ్రీవారి సేవకులు భక్తులకు విస్తృత సేవలు అందిస్తోన్నారు. క్యూలైన్లలోని భక్తులకు నిరంతరాయంగా నాలుగు షిప్టుల్లో అన్నప్రసాదాలు, మంచినీటిని పంపిణీ చేస్తున్నారు. వీరి సేవలను శ్రీవారి సేవ గ్రూప్ సూపర్ వైజర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
విజిలెన్స్, ఆలయ విభాగాలు దర్శన క్యూలైన్లను సమర్థంగా నిర్వహిస్తున్నాయి. మూడు రోజుల్లో దాదాపు 2.4 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. కల్యాణకట్ట, మెడికల్, రేడియో, రిసెప్షన్ ,బ్రాడ్ కాస్టింగ్ తదితర విభాగాలు కూడా భక్తులకు అవసరమైన సేవలను నిరంతరాయంగా అందిస్తున్నాయి.












Click it and Unblock the Notifications