సంచలనం: వైసీపీ ఎంపీల రాజీనామా -తిరుపతిలో ఓడితే చేస్తారన్న మంత్రి పెద్దిరెడ్డి -పవన్ పెయిడ్ ఆర్డిస్ట్
ప్రతిష్టాత్మక తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక నేపథ్యంలో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తిరుపతి ఉప ఎన్నికకు ఏపీ ప్రత్యేక హోదాతో ముడిపెడుతూ రాజీనామాలకు సిద్ధమని టీడీపీ చీఫ్ చంద్రబాబు సవాలు విసరగా, వైసీపీ సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ సవాలును స్వీకరించారు. తిరుపతిలో గురుమూర్తి గనుక ఓడిపోతే, వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారని మంత్రి తెలిపారు. ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు..

బాబు సవాల్.. వైసీపీ రియాక్షన్
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు అనూహ్య ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వినిపించిన రాజీనామా అస్త్రాన్ని సంధించారు. ''గతంలో ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తారా అని అడిగారు.. ఇప్పుడు మేం చేస్తాం. మీకు ఆ దమ్ము ఉందా.?'' అంటూ చంద్రబాబు సవాల్ చేశారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా సాధిస్తానని జగన్ చెప్పారని గుర్తు చేశారు. అందుకే ప్రజలు నమ్మారని.. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్కసారైనా ఆ ప్రస్తావన తెచ్చారా అని ప్రశ్నించారు చంద్రబాబు. టీడీపీ చీఫ్ సవాలు చేసిన కొద్ది గంటలకే మంత్రి పెద్దిరెడ్డి రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు సవాలును స్వీకరించారు.

పెద్దిరెడ్డి సంచలన ప్రకటన
తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని ముడిపెడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు విసిరిన రెఫరెండం సవాల్ను మంత్రి పెద్దిరెడ్డి స్వీకరించారు. ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి.. వైసీపీ ఓడిపోతే 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పారు. టీడీపీ ఓడితే ముగ్గురు ఎంపీలతో పాటు రఘురామరాజుతో రాజీనామా చేయిస్తారా? అని ప్రశ్నించారు. టీడీపీకి ఉన్నది ముగ్గురు ఎంపీలే అయినా, రఘురామకృష్ణంరాజు కూడా అనుంగ అనుచరుడిగా వ్యవహరిస్తున్నాడని, కాబట్టి మొత్తం నలుగురు ఎంపీలూ రాజీనామాకు సిద్దం కావాలని సవాలు విసురుతున్నామన్నారు.

తిరుపతిలో జగన్ సభ రద్దు అందుకే
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటం, తాజాగా కొత్త కేసులు మూడు వేల మార్కును దాటిన నేపథ్యంలో జాగ్రత్త చర్యల్లో భాగంగానే ముఖ్యమంత్రి జగన్ తిరుపతి బహిరంగ సభను రద్దు చేసుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. కోవిడ్ వ్యాప్తి కారణంగానే సీఎం జగన్ తిరుపతి సభ రద్దయింది తప్ప దీనికి వేరే కారణాలేవీ లేవన్నారు. గడిచిన 20 నెలల్లో సీఎం జగన్ చేసిన ప్రజాహిత కార్యక్రమాలే తిరుపతి ఎన్నికలో తమకు ఆయుధాలని మంత్రి చెప్పారు. ఇక..

పవన్ ఓ పొలిటికల్ పెయిడ్ ఆర్టిస్ట్
తిరుపతి ఎన్నికల్లో ప్రజలను ధైర్యంగా ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదని, విభజన హామీలను నెరవేర్చకుండా ప్రజలను బీజేపీ మోసం చేస్తోందని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. గతంలో ఏపీకి ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబు దత్తపుత్రుడైన పవన్ కల్యాణ్ మొన్నటిదాకా బీజేపీని బాగా తిట్టి, ఇప్పుడు అవే పాచిపోయిన లడ్డూలను తీపిగా తింటున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ పొలిటికల్ పెయిడ్ ఆర్టిస్ట్ అని, తిరుపతిలో టీడీపీ, జనసే, బీజేపీలు లోపాయికారీ ఒప్పందంతో ముందుకు వెళుతున్నాయని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. మరోవైపు..
Recommended Video

వకీల్ సాబ్ను ఇబ్బంది పెట్టలేదు..
జనసేనాని పవన్ కల్యాణ్ ను పొలిటికల్ పెయిడ్ ఆర్టిస్టుగా మంత్రి పెద్దిరెడ్డి విమర్శించగా, మరో మంత్రి అవంతి శ్రీనివాస్.. పవన్ కొత్త సినిమా 'వకీల్ సాబ్'పై కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనాని పవన్కల్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా విషయంలో తాము ఇబ్బంది పెట్టలేదని మంత్రి అవంతి అన్నారు. ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సినిమా టికెట్ల ధరపై సామాన్యులను దృష్టిలో ఉంచుకొనే నిర్ణయం తీసుకున్నామన్నారు.
సినిమాలు చూసి ..ప్రజలు ఓట్లు వేయరని ఎద్దేవా చేశారు. వకీల్ సాబ్ సినిమాకు మూడు రోజులపాటు (9వ తేదీ నుంచి 11 వరకు) ఎగ్జిబిటర్లు నిర్ణయించిన ధరలకు టికెట్లు విక్రయించుకునేందుకు అనుమతి ఇస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం సవరించడం, 11వ తేదీ ఆదివారం నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు అమ్మాలని థియేటర్ యాజమాన్యాలకు కోర్టు స్పష్టం చేయడం తెలిసిందే.












Click it and Unblock the Notifications