తిరుపతిలో ప్రచారానికి నేటితో తెర- గెలుపు అంచనాలివే- పోలింగ్ శాతమే కీలకం
తిరుపతి లోక్సభ ఉపఎన్నికల్లో హోరాహోరీగా సాగిన ప్రచార పర్వానికి ఇవాళ తెరపడబోతోంది. మూడు వారాలుగా ఓ రేంజ్లో ప్రచారం సాగించిన పార్టీలు, మైకులు ఇవాళ సాయంత్రం తర్వాత మూగబోనున్నాయి. అయితే ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, బీజేపీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ మూడు పార్టీలకు గెలుపుకు మించి మెజారిటీలు కీలకంగా మారిపోతున్నాయి. అసలే కరోనా సమయంలో జరుగుతున్న ఎన్నిక కావడంతో పోలింగ్ శాతమే విజేతను నిర్ణయించినా ఆశ్చర్యం లేకపోవచ్చు.
తిరుపతి ప్రచారానికి ఇవాళ తెర
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక కోసం జరుగుతున్న ప్రచార పర్వానికి నేటితో తెరపడబోతోంది. కొన్నిరోజులుగా హోరాహోరీగా ప్రచారం సాగిన రాజకీయ పార్టీలు, నేతలు ఇవాళ సాయంత్రం తర్వాత మౌనం వహించాల్సిన పరిస్ధితి. అయితే ఓటర్లను ఆకట్టుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు కూడా భారీగా సాగుతున్న ఈ ఎన్నికల్లో పలు కీలక అంశాలు విజేతను నిర్ణయించబోతున్నాయి. ఇందులో పోలింగ్ శాతంతో పాటు ధనప్రవాహం, చివరి నిమిషం ప్రలోభాలు, సంక్షేమ పథకాలు తీసేస్తామనే హెచ్చరికలు.. ఇలా ఎన్నో అంశాలు చివరి నిమిషంలో ఓటర్లపై ప్రభావం చూపబోతున్నాయి.
తిరుపతిలో గేమ్ ఛేంజర్గా పోలింగ్ శాతం
తిరుపతి ఉప ఎన్నికలో ఇప్పటివరకూ సాగిన ప్రచారం ఓ ఎత్తయితే చివరి నిమిషంలో చోటు చేసుకునే పరిణామాలు, ఓటింగ్ శాతం కూడా అత్యంత కీలకం కానున్నాయి. ఇందులో ప్రధానమైనది పోలింగ్ శాతం. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఎల్లుండి నమోదయ్యే పోలింగ్ శాతం అభ్యర్ధుల జాతకాల్ని తారుమారు చేయబోతోంది. కరోనా కారణంగా ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, కార్యకర్తలు సైతం ప్రచారానికి దూరంగా ఉండిపోయారు.
స్వయంగా సీఎం జగన్, పవన్ కళ్యాణ్ వంటి వారు ప్రచారానికి దూరమయ్యారు. దీంతో అక్కడ కరోనా ప్రభావం ఏ స్దాయిలో ఉందో అర్దం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్ధితుల్లో తమ అభ్యర్ధి గెలుపు కోసం ఓటేయాలని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల్ని పోలింగ్ బూత్లకు రప్పించడం పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్యను వారు ఏ మేరకు అధిగమిస్తారన్న దానిపైనే అభ్యర్ధుల విజయావకాశాలు, ఓట్ల చీలికలు ఆధారపడతాయి.
తిరుపతిలో గెలిచేదెవరు ? మెజార్టీ ఎంత
ప్రస్తుతం తిరుపతి ఉపఎన్నిక ప్రచార సరళి, క్షేత్రస్దాయిలో పరిణామాలు, పార్టీల బలాబలాలు, స్ధానిక బలం, ధన ప్రవాహం.. ఇలా ఎన్నో అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటే వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి గెలుపు ఖాయంగా తెలుస్తోంది. ఆయనకు గట్టి పోటీ ఇస్తున్న టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి, బీజేపీ అభ్యర్ధి రత్నప్రభకు నిరాశ తప్పకపోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. కానీ ఈ త్రిముఖ పోరులో వైసీపీ అభ్యర్ధి గెలుపు అంత సునాయాసం కాకపోవచ్చని తెలుస్తోంది. గతంలో వైసీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్ అప్పటి టీడీపీ అభ్యర్ది పనబాక లక్ష్మిపై 2.2 లక్షల మెజార్టీతో గెలుపొందారు. ఈ మెజార్టీని గురుమూర్తి నిలబెట్టుకోవడం లేదా అంత కంటే తక్కువ మెజారిటీ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Recommended Video
భారీగా ఓట్ల చీలిక
తిరుపతి ఉపఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్దులు గురుమూర్తి, పనబాక లక్ష్మి, రత్నప్రభ మధ్య భారీగా ఓట్ల చీలిక ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. వీరిలో గురుమూర్తి, పనబాక లక్ష్మి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, పనబాక, రత్నప్రభ రూపంలో ఇద్దరు మహిళా అభ్యర్ధులు బరిలో ఉండటం, జనసేన ప్రభావంతో కాపు ఓట్లలో వస్తున్న చీలిక ఇలా.. పలు రకాలుగా ఓట్ల చీలిక తప్పేలా లేదు. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రభావంతో పాటు అధికార బలం, స్ధానికంగా వైసీపీ ఎమ్మెల్యేలే అధికారంలో ఉండటం వంటి కారణాలతో వైసీపీ గట్టెక్కవచ్చని తెలుస్తోంది. పోలింగ్ శాతం ఎంత పెంచుకుంటే అంత వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి మెజార్టీ పెరగవచ్చనే అంచనాలున్నాయి.