సీఎం జగన్ రికార్డుకు గురుమూర్తి ఎసరు: అక్కడికి లైన్ క్లియర్: పార్టీలో కీలక బాధ్యతలు..?
తిరుపతి: తిరుపతి దివంగత ఎంపీ బల్లి దుర్గారావు మృతితో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఏప్రిల్ 17వ తేదీన జరిగిన ఈ ఉపఎన్నికలో మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి బరిలో నిలువగా.. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థినిగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రత్నప్రభ పోటీ చేశారు. ఇక మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ తెలుగుదేశం తరపున పోటీచేయగా కాంగ్రెస్ తరపున మాజీ ఎంపీ చింతామోహన్ బరిలోదిగారు. ఇక తిరుపతి పార్లమెంటుకు సంబంధించి ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ ఆరా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేసింది.
తిరుపతిలో పోలింగ్ రోజున ఎక్కువగా హడావుడి కనిపించినప్పటికీ... ఆ సీటును అధికార వైసీపీ నిలబెట్టుకుంటోందని ఆరా సంస్థ అంచనా వేసింది. తిరుపతిలో అధికార వైసీపీకి 65.85 శాతం ఓట్లు పడినట్లు ఆరా సంస్థ జోస్యం చెప్పింది. ఇక టీడీపీకి 23.10 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని, బీజేపీ 7.34శాతంతో మూడో స్థానంకు పరిమితం అవుతుందని తమ సర్వేలో స్పష్టంగా తేలినట్లు ఆరా సంస్థ వెల్లడించింది. ఇతరులకు 3.71శాతం ఓట్లు పోలైనట్లు వెల్లడించింది.
ఇక తిరుపతి ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, పోలింగ్ వరకు ఉత్కంఠభరిత వాతావరణం కనిపించింది. విపక్ష పార్టీలు జగన్ ప్రభుత్వంపై అస్త్రాలు సంధించాయి. అయినప్పటికీ ప్రజలు మాత్రం సంక్షేమ పథకాల వైపే మొగ్గుచూపినట్లు ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే అర్థం అవుతోంది. తిరుపతి సీటు తమదేనంటూ కేవలం మెజార్టీ కోసమే చూస్తున్నామని, అదే సమయంలో టీడీపీ - బీజేపీలు రెండో స్థానంకు పోటీ పడుతున్నాయని వైసీపీ ధీమా వ్యక్తం చేసింది. ఇక ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాడీ వేడీగా బీజేపీ తరపున ప్రచారం చేసినప్పటికీ పెద్దగా ఉపయోగం కనిపించలేదని పలు సర్వే సంస్థలు తెలిపాయి. ఇక తిరుపతి ఉపఎన్నిక వేళ పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ ఓటర్లపై ప్రభావం చూపుతుందని పలువురు భావించినప్పటికీ అదికూడా బెడిసి కొట్టినట్లు ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే అర్థమవుతోందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2019 తర్వాత జరిగిన పంచాయతీ, కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న అధికారిక వైసీపీ పార్టీ, మరోసారి తిరుపతి ఉపఎన్నిక సీటు నిలబెట్టుకుని సత్తా చాటుతుందని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి హాట్ హాట్గా సాగిన తిరుపతి ఉపఎన్నిక అసలు ఫలితాలు మే 2న వెలువడునున్నాయి. అంతకంటే ముందు ఉపఎన్నిక రద్దు కోరుతూ బీజేపీ టీడీపీలు కోర్టును ఆశ్రయించాయి.
Recommended Video
మొత్తానికి వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత కడప ఉపఎన్నికలో ఎంపీగా పోటీచేసిన ప్రస్తుత సీఎం జగన్ రికార్డును గురుమూర్తి బ్రేక్ చేసే అవకాశాలున్నాయని, లేదంటే ఆ రికార్డుకు చేరవయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.