పవిత్ర తిరుపతిలో ముంతాజ్ హోటల్స్- వారాహి డిక్లరేషన్ అంటే ఏడుకొండలను గుండు కొట్టడమా?
Tirupati Mumtaz Hotel: ఆధ్యాత్మిక నగరిగా, టెంపుల్ టౌన్గా విరాజిల్లుతున్న తిరుపతిలో ముంతాజ్ హోటల్స్ నిర్మాణం వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది హిందువులను తీవ్ర ఆందోళనలకు గురి చేస్తూ వస్తోంది. కలియుగ వైకుంఠంలా అలరారుతున్న తిరుమలకు వెళ్లే మార్గంలో అలిపిరి సమీపంలో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం మరోసారి తెర మీదికి రావడమే దీనికి ప్రధాన కారణం.
మూడు నెలల కిందటే..
హిందువుల మనోభావాలకు విరుద్దంగా అలిపిరి జూపార్క్ రోడ్డులో నిర్మితమౌతోన్న ముంతాజ్ హోటల్కు ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలంటూ గత ఏడాది తిరుక్షేత్రాల రక్షణ సమితి, రాయల్ పీపుల్ ఫ్రంట్ అధ్యక్షుడు తుమ్మా ఓంకార్, రెడ్డి శేఖర్ రాయల్, సనాతన ధర్మ పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు.

దేవలోక్ ప్రాజెక్టులో..
టీటీడీ, తిరుపతి పవిత్రతను దెబ్బతీయడానికి గత ప్రభుత్వం దేవలోక్లో 60 ఎకరాల్లో 20 ఎకరాలు ముంతాజ్ హోటల్స్కు కేటాయించిందని ఆరోపించారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఈ 20 ఎకరాల్లో వంద విల్లాలను ముంతాజ్ హోటల్ యాజమాన్యం నిర్మించనుందని, అక్కడ విచ్చలవిడిగా మద్యం, మాంసం లాంటి విష సంస్కృతిని పెంపొందించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందని వాళ్లు మండిపడ్డారు. ఈ హోటల్కు కేటాయించిన స్థలాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
టీటీడీ ఛైర్మన్ వివరణ..
దీనిపై అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించిన విషయం తెలిసిందే. 2014 నుంచి 2019 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అలిపిరి సమీపంలో దేవలోకం పేరుతో ఓ భారీ పర్యాటక ప్రాజెక్ట్ను నిర్మించ తలపెట్టిందని, దీనికోసం అప్పట్లో 60 ఎకరాలను కేటాయించిందని అన్నారు.
రద్దు చేయాలని తీర్మానం..
2019 తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దీన్ని మార్చివేసిందని, దేవలోకం ప్రాజెక్ట్కు కేటాయించిన 60 ఎకరాల్లో 20 ఎకరాలను ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి మంజూరు చేసిందని వివరించారు. ఇప్పుడు ప్రభుత్వం మారిందని, మళ్లీ ఈ వివాదం తెర మీదికి వచ్చిన నేపథ్యంలో దీన్ని రద్దు చేయాలని తీర్మానించినట్లు బీఆర్ నాయుడు తెలిపారు.
టీటీడీ పాలక మండలి సమావేశంలో సైతం
ఈ తీర్మానాన్ని టీటీడీ పాలక మండలి సమావేశంలో సైతం ఆమోదించామని ఆయన అన్నారు. ముంతాజ్ హోటల్స్కు కేటాయించిన స్థలం లీజును వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోన్నామని చెప్పారు. ఈ మేరకు టీటీడీ పాలక మండలి ఆమోదించిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపిస్తామని పేర్కొన్నారు. ఆ స్థలాన్ని మళ్లీ టీటీడీకే అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరనున్నామని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.
సమస్య యధాతథం..
అవేవీ కూడా కార్యరూపం దాల్చలేదనేది తాజాగా తేలిపోయింది. ముంతాజ్ హోటల్ నిర్మాణం యధాతథంగా కొనసాగుతోందంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఇదే విషయంపై తాజాగా స్వామీజీలు సైతం రోడ్డెక్కారు. భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. తిరుపతిలోని టీటీడీ అడ్మిన్ భవన్ ముందు నిరాహార దీక్షకు దిగారు.
ఒకటే నినాదం..
ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని నిలిపివేయాలని, అనుమతులను రద్దు చేయాలంటూ స్వామీజీలు ముక్తకంఠంతో నినదిస్తోన్నారు. శ్రీవారి చిత్రపటానికి పూజలను నిర్వహించిన అనంతరం దీక్షకు దిగారు. సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి సహా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సాధవులు ఇందులో పాల్గొన్నారు.
చర్చనీయాంశమైన ప్లకార్డులు..
ఈ సందర్భంగా సాధువులు ప్రదర్శించిన ప్లకార్డులు అందరి దృష్టినీ ఆకట్టుకున్నాయి. వారాహి డిక్లరేషన్ అంటే ఏడుకొండలకు గుండు కొట్టడమా పవన్ కల్యాణ్ గారూ.., వారాహి డిక్లరేషన్ అంటే కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనా పవన్ కల్యాణ్ గారూ.. అంటూ ఆ ప్లకార్డులపై రాశారు. అవే నినాదాలుగా వినిపించారు.












Click it and Unblock the Notifications