వర్షాలు పడకుంటే బాబు 'పంట-సంజీవిని' స్కీం, హైదరాబాద్ నుంచి ఏపీకి విద్యాశాఖ
గుంటూరు: వర్షాలు పడని రోజుల్లో 'పంట సంజీవని' పథకం అమలు చేస్తామని, తిరుపతి - చెన్నై - నెల్లూరు మధ్య పారిశ్రామిక కారిడార్ నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు చెప్పారు.
చిత్తూరు జిల్లా తిరుపతిలో కల్యాణి జలాశయాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. చిత్తూరు పరిశ్రమలకు అనువైన ప్రాంతమన్నారు.
ఏపీని కరవురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. వర్షాలు పడని రోజుల్లో పంటలను కాపాడేందుకు 'పంట సంజీవని' పథకం అమలు చేయనున్నట్లు చెప్పారు. కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకే పంట సంజీవిని లక్ష్యమన్నారు.
20 లక్షల ఎకరాల్లో పంట సంజీవని పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. మూడు నుంచి ఎనిమిది మీటర్ల వరకే భూగర్భ జలాలు వాడుకొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భూగర్భ జలాల వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు.
మూడు నెలల్లో అమరావతికి విద్యా శాఖ
మూడు నెలల్లో ఏపీ రాజధాని అమరావతికి విద్యాశాఖను తరలిస్తామని మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు. ఒకే భవనంలో అన్ని శాఖలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామన్నారు. అధికారులు, ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి సహకరించాలన్నారు. విద్యాశాఖతో పాటు పలు కీలక శాఖలు మరో మూడు నెలల్లో రాజధానికి తరలిపోతాయని గంటా చెప్పారు.