టీటీడీ ఛైర్మన్, ఈవోపై కేసు నమోదు చేయాలి..
Tirupati Stampede: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నాయకులు తమ సంతాపం తెలిపారు.
తిరుపతిలోని విష్ణునివాసం వద్ద బుధవారం రాత్రి ఈ దుర్ఘటన సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. వారిలో అయిదుమంది మహిళలు ఉన్నారు. 40 మంది వరకు గాయపడ్డారు. వాళ్లందరినీ శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్), శ్రీవేంకటేశ్వర రామ్నారాయణ్ రూయా ఆసుపత్రులకు తరలించారు.

ఈ ఘటన పట్ల ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్ కే రోజా ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై విమర్శలు సంధించారు.
వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం క్యూలైన్లో జరిగిన తొక్కిసలాటలో ఆరుమంది తమ నిండు ప్రాణాలని కోల్పోవడం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అన్నారు. ఈ ప్రభుత్వానికి సామాన్య ప్రజలంటే ఇంత నిర్లక్ష్యమా? అంటూ నిలదీశారు. ఘటనపై కేంద్రం కలగజేసుకోవాలని చెప్పారు.
భక్తుల పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన తిరుమల తిరుపతి పాలక మండలి ఛైర్మన్, ఈవో, ఎస్పీ, ఇతర అధికారులపై వెంటనే కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. అధికార యంత్రాంగాన్ని తన పర్యటనలో వినియోగించుకొని ఇంతమంది చావుకి కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు.
గత అయిదు సంవత్సరాల నుండి తాను తిరుమలకు వస్తున్నాను కానీ ఎప్పుడూ ఇలా జరగలేదని, ఈ సంవత్సరమే ఈ దుర్ఘటన సంభవించిందంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఓ భక్తుడి వీడియో క్లిప్ను రోజా తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. చచ్చిపోతాననుకున్నానని, దేవుడి దయవల్ల బతికానని ఆమె చెప్పడం ఈ వీడియోలో ఉంది.












Click it and Unblock the Notifications