వారికి తిరుమలలో ప్రొటోకాల్ వైకుంఠ ద్వార దర్శనం
Tirupati Stampede incident: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన ప్రకంపనలు తగ్గట్లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై విమర్శల ముప్పేట దాడి కొనసాగుతూనే ఉంది.
తిరుపతి బైరాగిపట్టెడ పద్మావతి పార్కు, విష్ణునివాసం వద్ద బుధవారం రాత్రి ఈ దుర్ఘటన సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. వారిలో అయిదుమంది మహిళలు ఉన్నారు. 41 మంది గాయపడ్డారు. యావత్ దేశాన్నీ దిగ్భ్రాంతికి గురి చేసిన ఉదంతం ఇది.

ఈ దుర్ఘటనలో మృతి చెందిన ఆరుమంది కుటుంబాలకు ఎక్స్గ్రేషియా పంపిణీ చేయాలని టీటీడీ బోర్డు ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆరుమంది మృతులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు స్వయంగా ఎక్స్గ్రేషియా చెక్కులను పంపిణీ చేయడానికి బోర్డు సభ్యులతో రెండు కమిటీలను ఏర్పాటు చేశారు.
విశాఖపట్నం, నర్సీపట్నం సందర్శించే బృందంలో బోర్డు సభ్యులు జోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, పనబాక లక్ష్మి, జానకీ దేవి, మహేందర్ రెడ్డి, ఎంఎస్ రాజు, భాను ప్రకాష్ రెడ్డి ఉన్నారు. తమిళనాడు, కేరళను సందర్శించే బోర్డు సభ్యుల కమిటీలో రామమూర్తి, కృష్ణమూర్తి వైద్యనాథన్, నరేష్ కుమార్, శాంతారాం, సుచిత్ర ఎల్లా ఉన్నారు.
ఈ రెండు కమిటీలు ఆయా ప్రాంతాల్లోని మృతుల కుటుంబాల ఇళ్లను సందర్శించి, స్థానిక శాసన సభ్యులతో కలిసి ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చెక్కులను అందించనున్నారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ వారికి కూడా చెక్కుల పంపణీ కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టింది. స్విమ్స్ డైరెక్టర్ ఛాంబర్లో ఏడుమంది బాధితులకు బీఆర్ నాయుడు చెక్కులను అందజేశారు.
అదే సమయంలో ఈ ఘటనలో గాయపడి కోలుకున్న మరో 28 మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించారు టీటీడీ అధికారులు. పాలకమండలి ఛైర్మన్ బీఆర్ నాయుడి ఆదేశాల మేరకు ఈ ఉదయం వారికి ప్రొటోకాల్ బ్రేక్ దర్శనం చేయించారు. పూర్తిస్థాయిలో కోలుకున్న నేపథ్యంలో వారిని ఈ ఉదయం తిరుమలకు తీసుకొచ్చారు. ప్రొటొకాల్ దర్శనం చేయించారు. తీర్థప్రసాదాలను అందజేశారు.
టీటీడీ ఖర్చులతోనే వాళ్లందరూ తమ స్వస్థలాలకు బయలుదేరి వెళ్తారని అధికారులు వెల్లడించారు. ఇదివరకే మొత్తం 52 మందికి ప్రత్యేక దర్శనం కల్పించారు అధికారులు. ఇప్పుడు గాయపడ్డ వారిలో మరో 28 మంది పూర్తిగా కోలుకోవడంతో వారికి కూడా వైకుంఠ ద్వార దర్శనం చేయించారు.












Click it and Unblock the Notifications