తిరుపతి తొక్కిసలాటపై మౌనం వీడిన టీటీడీ ఈఓ
Tirupati Stampede: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నాయకులు తమ సంతాపం తెలిపారు.
తిరుపతిలోని విష్ణునివాసం వద్ద బుధవారం రాత్రి ఈ దుర్ఘటన సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. వారిలో అయిదుమంది మహిళలు ఉన్నారు. 41 మంది గాయపడ్డారు. వాళ్లందరినీ శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్), శ్రీవేంకటేశ్వర రామ్నారాయణ్ రూయా ఆసుపత్రులకు తరలించారు.

ఈ తొక్కిసలాట ఘటన పట్ల తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో తొమ్మిది, తిరుమలలో ఒక టోకెన్ కౌంటర్ వద్ద భక్తులకు భద్రతను కల్పించదానికి చాలినంత మంది పోలీసులను విధి నిర్వహణలో మోహరింపజేశామని, టీటీడీ, జిల్లా అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేశామని వివరించారు.
తాజాగా ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు స్పందించారు. ఈ ఉదయం ఆయన తిరుపతి స్విమ్స్, రూయా ఆసుపత్రులను సందర్శించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య చికిత్స గురించి ఆరా తీశారు. డాక్టర్లను అడిగి వివరాలను సేకరించారు.
అనంతరం ఆయన అక్కడే విలేకరులతో మాట్లాడారు. తొక్కిసలాటను దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు. తిరుపతి, తిరుమలల్లో గల అన్ని కౌంటర్ల వద్ద ముందస్తు జాగ్రత్తలను తీసుకున్నామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అయినప్పటికీ ఇలా జరగడం విచారకరమని చెప్పారు.
ఘటన సంభవించడానికి గల కారణాలపై విశ్లేషించారు. ప్రాథమికంగా వేసిన అంచనాల గురించి వివరించారు. ప్రాథమికంగా అందిన ఆధారాలను బట్టి చూస్తే గేటును తెరిచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటనకు దారి తీసినట్టుగా అనిపిస్తోందని అన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications