తిరుమలలో చైత్రశుద్ధ పౌర్ణమి రోజు కన్నుల పండుగగా, ఆరోజుల్లో ఆ సేవలు రద్దు, శ్రీవారి భక్తులు హ్యాపీ !
ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి రోజు సాలకట్ల వసంతోత్సవాలు ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ.
తిరుమల/తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 3 నుండి 5వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఆదిశగా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి రోజు వసంతోత్సవాలు ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. ఎప్పటిలాగే ఈ సంవత్సరం సాలకట్ల వసంతోత్సవాలు వైభంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసే విషయంలో నిమగ్నం అయ్యారు. ఇదే సమయంలో పలు సేవలు రద్దు చేశామని టీటీడీ తెలిపింది.
TTD: తిరుమలలో గదలు ఇక ముందు ఇలాగే ఇస్తారు, నెలకు ఎన్నిసార్లు అంటే, లడ్డూలకు రూల్స్ !
సాలకట్ల వసంతోత్సవాలు
ఏప్రిల్ 3వ తేదీన ఉదయం 7 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఈ సందర్బంగా నాలుగు మాడవీధుల్లో శ్రీవారి భక్తులు పలు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
బంగారు రథం మీద శ్రీవారు
రెండవరోజు ఏప్రిల్ 4న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజు ఏప్రిల్ 5న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.
స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లు
ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.
పలు సేవలు రద్దు చేసిన టీటీడీ
వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 4న అష్టదళ పాదపద్మారాధన, ఏప్రిల్ 3 నుండి 5వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అయితే ఎప్పటిలాగే శ్రీవారి భక్తులకు సర్వదర్శనం ఉంటుందని టీటీడీ తెలిపింది.