సైకిలెక్కిన వైసీపీ ఎమ్మెల్యే : మత్తు పదార్ధాల కోసం వేట : పరుగులు తీస్తున్న పోలీసులు..!!
ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన తీరు టెంపుల్ సిటీలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ సీనియర్ నేత..టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన, తొలి నుండి వైఎస్సార్ కుటుంబానికి విధేయుడు. వైఎస్సార్ పాదయాత్ర సమయం నుండి ప్రతీ కీలక సమయంలోనూ ఆయన వెంటే ఉండేవారు. 2004 లో వైఎస్సార్ తొలి సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార సమయంలోనూ ఆయన వేదిక పైనే ఉన్నారు. ఇక, వైఎస్సార్ హాయంలో టీటీడీ ఛైర్మన్ గా పని చేసారు.
ఆ సమయంలో దళిత గోవిందం, కళ్యాణ మస్తు వంటి వినూత్న కార్యక్రమాలు ప్రారంభించారు. వైఎస్ మరణం తరువాత జగన్ తోనే నిలిచారు. ఇక, 2019 ఎన్నికల్లో గెలిచిన భూమన మంత్రి అవుతారని ప్రచారం సాగింది. కానీ, జిల్లా సమీకరణాలతో సాధ్యపడలేదు. అయితే, ఈ సారి ఆయన కుమారుడు తిరుపతిలో రాజకీయంగా..పార్టీ పరంగా యాక్టివ్ అయ్యారు. ఎమ్మెల్యే భూమన రెండు సార్లు కరోనా బారిన పడ్డారు. అయినా..కరోనా సమయంలో అనేక కార్యక్రమాలు నిర్వహించి చర్చల్లో నిలిచారు. పారిశుద్ద పనులు చేయటం.. కరోనా ఆస్పత్రుల్లోకి వెళ్లి వార్డుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించటం చేసారు.
ఇక, కరోనాతో మరణించి అనాధ డెడ్ బాడీస్ గా మిగిలిపోయిన వాటిని స్వచ్చంద సంస్థ ప్రతినిదుల తో కలిసి మోసారు. వాటిని ఖననం..దహనం స్వయంగా చేసారు. ఇక, రోడ్డు మీద గన్ మెన్ లేకుండా నడుచుకుంటూ వెళ్తూ..ఎవరూ ఎమ్మెల్యే అని గుర్తించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ...అక్కడి సమస్యలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. సైకిల్ పైన నగర వీధుల్లో తిరుగుతూ అన్నీ పర్యవేక్షిస్తున్నారు. ఇక, తాజాగా ఎమ్మెల్యే భూమన టెంపుల్ సిటీలో మత్తు పదార్ధాల నివారణకు నడుం కట్టారు.
అందులో భాగంగా .. నగరంలోని అనేక ప్రాంతాల్లో మత్తు పదార్ధాలు అమ్ముతున్నారు..వినియోగిస్తున్నారనే అనుమానం ఉన్న చోటకు వెళ్లి పట్టుకొనే ప్రయత్నం చేసారు. ఆయన వెంట పోలీసులు పరుగులు తీస్తున్నారు. పోలీసులు చేయాల్సిన పనులు సైతం భూమన చేయటం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఇక, తిరుపతి ఎమ్మెల్యేగా తాజాగా సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల వచ్చిన సమయంలో ఆయనకు వీడ్కోలు పలికే వరకూ ఆయనతోనే ఉన్నారు. అప్పటికే జస్టిస్ ఎన్వీ రమణతో ఉన్న పరిచయం భూమనకు కలిసి వచ్చింది.
Recommended Video
ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్ నియామకం కోసం జరుగుతున్న కసరత్తులో భూమన పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే, వచ్చే ఎన్నికల్లో భూమన స్థానంలో ఆయన తనయుడు అభినయ్ పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే అభినయ్ ను సీఎం వద్దకు భూమన అనేక సార్లు తీసుకెళ్లారు. ఇప్పుడు టెంపుల్ సిటీలో స్థానిక ఎమ్మెల్యేగా భూమన కొత్త శైలి.. వైసీపీలోనూ హాట్ టాపిక్ గా మారుతోంది.