తిరుమల శ్రీవారి నైవేద్యంలో ఆసక్తికర మార్పులు
పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో డిసెంబరు 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై పాశురాల ప్రవచనాలు చేయనున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం 5:30 గంటలకు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం ఏర్పాటు కానుంది. ఆచార్య చక్రవరి రంగనాథన్ తిరుప్పావై ప్రవచనం చేస్తారు.
టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ధనుర్మాసం ముగిసే వరకు తిరుమలలోని నాదనిరాజనం వేదిక, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, కేటీ రోడ్డులోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయం, శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం దక్షిణ మాడవీధిలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామివారి ఆలయం, శ్రీ గోవిందరాజ స్వామి వారి తేరుకు సమీపంలోని తొలప్ప మండపం, రామ్ నగర్ క్వార్టర్స్ వద్ద ఉన్న గీతా మందిరం, ఎల్ఎస్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతిరోజు తిరుప్పావై ప్రవచనాల పారాయణం జరుగుతుంది.
డిసెంబరు 16 మధ్యాహ్నం 1:23 నిమిషాలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ మరుసటి రోజు నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై పాశురాలను నివేదిస్తారు. జనవరి 14న ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు. బిల్వ పత్రాలతో సహస్ర నామార్చన చేస్తారు. శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతి రోజూ స్వామివారికి అలంకరిస్తారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష నైవేద్యాలుగా దోశ, బెల్లం దోశ, సుండలు, సీరా, పొంగల్ వంటి ప్రసాదాలను నివేదిస్తారు.

టీటీడీ స్థానికాలయాల్లో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 14వ తేదీ వరకు ప్రతిరోజూ తెల్లవారుజామున 4 నుండి 6 గంటల వరకు సుప్రభాతం స్థానంలో ఏకాంతంగా తిరుప్పావై పారాయణం, భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. ఈ కారణంగా సుప్రభాతం సేవా టికెట్లు జారీ చేయరు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నెల రోజుల పాటు తెల్లవారుజామున 5:15 నుండి 6:15 గంటల వరకు ధనుర్మాసం గంట, ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ కోదండరామస్వామి, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో తెల్లవారుజామున 4 నుండి 5:30 గంటల వరకు సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పారాయణం, 5:30 నుండి 6:30 భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు.












Click it and Unblock the Notifications