నెల రోజులు సుప్రభాత సేవ రద్దు, ఆ స్థానంలో - వైకుంఠ ద్వార దర్శనం దక్కాలంటే..!!
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవకు ప్రత్యేకత ఉంది. ఈ సేవతోన స్వామి వారిని మేల్కొలిపి అలంకరణ.. అర్చన నిర్వహిస్తారు. ఆ తరువాతనే భక్తుల దర్శనాలు ప్రారంభం అవుతాయి. అయితే, డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుంది. దీంతో, ధనుర్మాసం మొత్తం సుప్రభాత సేవను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయించింది. సుప్రభాత సేవ స్థానం లో తిరుప్పావై పారాయణం చేస్తారు. ప్రతీ ఏటా తిరుమలలో ఇదే ఆనవాయితీ కొనసాగిస్తు న్నారు. ఇక..వైకుంఠ ద్వార దర్శనంకు వచ్చే భక్తులకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు. బిల్వ పత్రాలతో సహస్ర నామార్చన చేస్తారు. శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతి రోజూ స్వామివారికి అలంకరిస్తారు. ధను ర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష నైవేద్యాలుగా దోశ, బెల్లం దోశ, సుండలు, సీరా, పొంగల్ వంటి ప్రసాదాలను నివేదిస్తారు. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు.

కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. కాగా, పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించు కుని డిసెంబరు 16 నుంచి 2026 జనవరి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా తిరుపతితో పాటు ఆంధ్రప్రదేశ్ -76, తెలంగాణ -57, తమిళనాడు- 73, కర్ణాటక- 21, పాండిచ్చేరి- 4, న్యూఢిల్లీ, ఒడిశాలో ఒకొక్క కేంద్రంలో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ధనుర్మాసంలో సుప్రభాతం బదులు తిరుప్పావై నివేదించడం విశేషం. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, కెటి రోడ్డులోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో తిరుప్పావై ప్రవచనాలు పారాయణం చేస్తారు.
12 మంది ఆళ్వారులలో ఒకరైన శ్రీ గోదాదేవి ధనుర్మాసం వ్రతం చేశారు. ఈ వ్రతం చేయడం వల్ల దేశం సమృద్ధిగా, సుభిక్షంగా ఉంటుంది. ఇక.. ఈ నెల30వ తేదీ నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ టోకెన్లు జారీ చేసింది. సామాన్యులకు దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ వెల్లడించింది.












Click it and Unblock the Notifications