ఆత్మరక్షణ: జగన్ తాజా అస్త్రం, పవన్ కళ్యాణ్ను కార్నర్ చేసేందుకేనా?
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా సాధన కోసం మంగళవారం నాడు రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. ఈసారి రాజీనామాపై ఆయన బలంగా చెప్పడానికి కారణం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రత్యేక హోదా ఇస్తామని బిజెపి, తెస్తామని టిడిపి చెప్పింది. కానీ ఆ తర్వాత రెండు పార్టీలు చేతులెత్తేశాయి. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా కోసం తొలి నుంచి ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది.
సంచలన నిర్ణయం, మోడీ-బాబులపై తీవ్ర ఒత్తిడి: జగన్కు దారి చూపిన కేసీఆర్అయితే ఏపీకి హోదా ఇవ్వలేమని, దానిని మించిన ప్యాకేజీ ఇస్తామని ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. దీంతో అప్పటిదాకా ప్రత్యేక హోదా గురించి పోరాడుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాస్త వెనుకబడినట్లుగా కనిపించిందని చెబుతున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ టిడిపి-బిజెపి కూటమికి మద్దతుగా నిలిచారు. ప్రచారం కూడా చేశారు. అలాంటి పవన్ హోదా పైన ప్రశ్నించడంతో ఓ విధంగా జగన్ కార్నర్ అయ్యారని చెప్పవచ్చు.
దానికి తోడు పవన్ వరుసగా జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక హోదా కావాలని, అది వస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. తొలుత తిరుపతిలో, ఆ తర్వాత కాకినాడలో బహిరంగ సభలు నిర్వహించారు. నవంబర్ 10వ తేదీన అనంతపురంలో నిర్వహిస్తున్నారు.
ప్రత్యేక హోదా పైన టిడిపి - బిజెపి చేతులెత్తేసిన తర్వాత పవన్ రంగంలోకి దిగడంతో.. హోదా అంశంపై వైసిపి కాస్త వెనుకబడింది. పైగా పవన్ వరుసగా సభలు నిర్వహిస్తున్నారు. ఈ హోదా అంశాన్ని తిరిగి పూర్తిగా తన చేతిలోకి తెచ్చే ఉద్దేశ్యంలో భాగంగా.. అంటే పవన్ను కార్నర్ చేసేందుకు జగన్ డెడ్ లైన్తో సహా రాజీనామా అస్త్రాన్ని తెరపైకి తెచ్చి ఉంటారని చెబుతున్నారు.
ప్రస్తుతానికి ప్రత్యేక హోదా అంశం పవన్ చేతికి వెళ్లిందని వైసిపి నేతలు కూడా భావిస్తున్నారని, ఆ క్రమంలోనే జగన్ దానిని తన పరం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజీనామాలు చేస్తే హోదా వచ్చినా, రాకున్నా జగన్కు పొలిటికల్ మైలేజీ మాత్రం దక్కుతుందని చెప్పవచ్చు.