సంచలన నిర్ణయం, మోడీ-బాబులపై తీవ్ర ఒత్తిడి: జగన్కు దారి చూపిన కేసీఆర్
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దారిలో నడిచేందుకు సన్నద్దమయ్యారు. మంగళవారం నాడు కర్నూలులో జరిగిన యువభేరీలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోగా హోదా పైన కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు. లేదంటే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పారు. తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించి, ప్రత్యేక హోదా నినాదంతో తిరిగి గెలుపొంది... నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే వ్యూహం జగన్ చేస్తున్నారు.
గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెరాస అధినేతగా ఉన్న కేసీఆర్ నాడు పలుమార్లు రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. ఏకంగా అధికార, ఇతర పార్టీలు కూడా రాజీనామాలు చేయాల్సిన పరిస్థితిని కేసీఆర్ కల్పించారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటంలో రాజీనామా'ల పాత్ర చాలా ఉంది.

రాజీనామా చేసి, తిరిగి ప్రత్యేక తెలంగాణ వాదంపై గెలిచి నాటి రాష్ట్ర ప్రభుత్వం పైన, అలాగే కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చారు.
విభజన సమయంలో ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఎన్నికల సమయంలోను అదే వాదన వినిపించారు. టిడిపి కూడా హోదా తెచ్చే బాధ్యత తమదని చెప్పింది. కానీ ఇప్పుడు హోదా పైన కేంద్రం చేతులెత్తేసింది. టిడిపి భారీ ప్యాకేజీ అని చెబుతోంది.
ఈ నేపథ్యంలో జగన్ తాజాగా, రాజీనామా అస్త్రాన్ని ఎంచుకున్నారు. రాజీనామాలు చేయడం ద్వారా ప్రత్యేక హోదా సెంటిమెంటును ప్రజల్లోకి మరింత తీసుకు వెళ్లే యోచనలో ఉన్నారని చెప్పవచ్చు.
రాజీనామా చేసి, ప్రత్యేక హోదా అంశంపై తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా జగన్కు పలు విధాలుగా రాజకీయ లబ్ధి చేకూరుతుంది. ఒకవేళ హోదా వసతే, తన వల్లనే వచ్చిందని జగన్ చెప్పడం, దీని ద్వారా 2019 ఎన్నికల్లో లబ్ధి పొందడం, హోదా రాకుంటే తాము రాజీనామాలు చేసినా టిడిపి, బిజేపీలు దిగి రావడం లేదని ప్రజల వద్దకు వెళ్లడం చేయవచ్చు.












Click it and Unblock the Notifications