ఆమరణ నిరాహార దీక్షలో కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్: SFI, AISF జాయిన్: హీటెక్కిన ఢిల్లీ
దేశ రాజధానిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో వివిధ వామపక్ష విద్యార్థి సంఘాలు భారీ ఆందోళనకు దిగాయి. కాక్రోచ్ జనతా పార్టీ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ నడుం బిగించాయి. సోనమ్ వాంగ్ చుక్ దీక్ష ఆమరణ నిరాహార దీక్షను తాము కొనసాగిస్తోన్నట్లు ప్రకటించాయి.
సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు ఈ ఉదయం భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఆయనను బలవంతంగా సఫ్దార్ జంగ్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని కూడా ఖాళీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నెల 20వ తేదీన వాంగ్చుక్ మద్దతుదారులు పార్లమెంట్కు శాంతియుత మార్చ్ చేపట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ గందరగోళం చోటుచేసుకుంది.

పోలీసులు నిరసనకారులపై బలప్రయోగం చేసి అక్కడి నుంచి తరలించడాన్ని నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ డిప్కే సంచలన నిర్ణయం తీసుకున్నారు. జంతర్ మంతర్ వేదికగా ఆయన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. తాము ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ఈ ప్రజా ఉద్యమాన్ని మరింత బలీయంగా మార్చాలని పిలుపునిచ్చారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 20 పార్లమెంట్ మార్చ్ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఢిల్లీ పోలీసుల చర్యను వ్యతిరేకిస్తూ నిరసన వేదిక వద్ద నిరసనకారులు భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ నేహా బోరాతో పాటు అక్కడ దీక్షలో కూర్చున్న ఇతర ప్రముఖ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయకుండా అడ్డుకునేందుకు విద్యార్థి సంఘాలు రక్షణ వలయంగా ఏర్పడ్డాయి. పోలీసు బలగాలు నిరసనకారులను చుట్టుముట్టడంతో జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ ఉద్రిక్త పరిస్థితులపై కొత్త ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ స్పందించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకే సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యం మరింత క్షీణించకుండా కాపాడటంలో భాగంగా డాక్టర్ల సలహా మేరకు ఆయనను సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో కొంతమంది నిరసనకారులు పోలీసుల విధులకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించినప్పటికీ, తాము సంయమనంతో వ్యవహరించామని అన్నారు
ఆందోళనకారుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ తదితరులు ప్రభుత్వ నియంతృత్వ పోకడలను దుయ్యబట్టారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్, సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ కూడా ఈ పోలీసు చర్యను తీవ్రంగా ఖండిస్తూ నిరసనకారులకు తమ మద్దతును ప్రకటించారు.














Click it and Unblock the Notifications