హాలీవుడ్ స్థాయిలో: కేసీఆర్తో దక్షిణాది సినీప్రముఖులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును సోమవారం పలువురు దక్షిణాది సినీ ప్రముఖులు కలుసుకున్నారు. సినీ సిటీని నిర్మిస్తామన్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో సినీ సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. హాలీవుడ్ స్థాయిలో చిత్రపురిని నిర్మిస్తామని చెప్పారు.
ఈ చిత్రపురిలో సినిమా నిర్మాణాలతో పాటు టీవీ సీరియళ్లు కూడా చిత్రీకరించేందుకు అనువుగా ఏర్పాటు చేస్తామన్నారు. గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్, యానిమిషన్.. ఇలా అన్ని ఉండేలా చూస్తామన్నారు. ఈ చిత్రపురి ఎక్కడ ఉండాలనే దాని పైన త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకోసం దేశంలోని సినీ రంగ, టాలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానం పలుకుతామన్నారు.
కేసీఆర్ను కలిసిన తెలంగాణ నిర్మాత మండలి
తెలంగాణ చలన చిత్ర నిర్మాతల మండలి ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిశారు. నిర్మాత కళ్యాణ్, దర్శకుడు శంకర్లు కూడా కలిశారు.
తెలంగాణలో రెండువేల ఎకరాల్లో చిత్రపురిని నిర్మిస్తామని చెప్పడం సంతోషించదగ్గ విషయమని తమ్మారెడ్డి భరద్వాజ వేరుగా అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సినీ పరిశ్రమ సమస్యలను ఆయనతో చర్చించానన్నారు. చర్చల ఫలితంగా సినిమా సిటీ రావడం ఆనందంగా ఉందన్నారు.
అయితే, పరిశ్రమలో నెలకొన్న సమస్యలకు ఇదొక్కటే సమాధానం కాదన్నారు. టిక్కెటింగ్ను కంప్యూటరైజ్డ్ చేయాలని, దాని వల్ల ప్రభుత్వానికి పన్ను కరెక్టుగా చేరుతుందన్నారు. ఈ విధానం వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు లాభం చేకూరుతుందన్నారు.
సినిమాలు, టీవీల షూటింగ్ సమయంలో పోలీస్ పర్మిషన్ల సమస్యలు వస్తున్నాయని, ఈ విషయాన్ని కూడా పరిశీలించాలని కోరారు. హైదరాబాదు ఫిల్మ్ ఫెస్టివల్ సిస్టమ్ పైన పునఃసమీక్షీంచాలన్నారు. రోజుకు ఐదు షోలు ఏర్పాటు చేస్తే చిన్న సినిమాల ప్రదర్శనకు వీలు కలుగుతుందన్నారు. చెన్నైలో అమ్మా థియేటర్స్ తరహాలో ఇక్కడ కూడా ఒక సిస్టమ్ను ప్రవేశపెడితే బాగుంటుందన్నారు. చిన్న సినిమాలకు పన్ను రాయితీ ఇవ్వాలన్నారు.