ప్రధాని మోడీకి హీరో శివాజీ లేఖ: 'ప్రత్యేక హోదా, బడ్జెట్పై మాట్లాడుతా'
హైదరాబాద్: భారత ప్రధాని నరేంద్రమోడీకి టాలీవుడ్ నటుడు, బీజేపీ నేత శివాజీ లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడటానికి అపాయింట్మెంట్ ఇవ్వాలని ఆ లేఖలో ఆయన కోరారు. దీనిపై స్పందించిన పీఎంఓ వర్గాలు వచ్చే వారం ఢిల్లీకి పిలుస్తామని చెప్పారని తెలిపారు.
ప్రధాని మోడీపై తనకు పూర్తి నమ్మకముందని హీరో శివాజీ చెప్పారు. ఆయన మాట తప్పే మనిషి కాదని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల ప్రచారంలో కూడా మోడీ హామీ ఇచ్చారని, ఎట్టి పరిస్ధితిలోనూ ఆయనిచ్చిన వాగ్దానాన్ని నిలుపుకుంటారని ఆ నమ్మకం తనకి ఉందన్నారు.
ప్రధాని మోడీతో ఏపీకి ప్రత్యేకహోదా, రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన బడ్జెట్పై కూడా తాను మాట్లాడతానని చెప్పారు. ప్రధాని మోడీ తనకు తానుగా ఏపీకి ప్రత్యేక హోదాపై మాట్లాడే దాగా ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు.

ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో వెంకయ్య నాయుడు పోరాడారన్న సంగతిని శివాజీ గుర్తు చేశారు. ఆనాడు సభలో మంత్రి జైరామ్ రమేష్ అనేక విషయాలు చెప్పారన్నారు. ఆ సందర్భంలో కేవీపీ, చిరంజీవి, జేడీ శీలం లాంటి నేతలు సభలోనే ఉన్నారని ఆయన చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో రాజ్యాంగ పరమైన అవరోధాలుంటే దానికి కొన్ని మార్పులు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని, దీని కోసం అన్ని పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సహకరించుకుంటేనే అందరం సంతోషంగా ఉంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications